
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Akash Ambani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని లక్షల కోట్ల సంపద ఉన్నా హుందాగా, అణకువగా ఉంటారు. తమ పిల్లలకూ అవే విలువలు నేర్పించారు. పిల్లలు తప్పులు చేసినప్పుడు అవసరమైతే కఠినంగానూ వ్యవహరించారు. ఇలాగే ఓ సందర్భంలో తమ కొడుకు ఆకాశ్ అంబానీతో వాచ్మెన్కి క్షమాపణ చెప్పించారని మీకు తెలుసా?
ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు లక్షల కోట్ల సంపద ఉన్నా డౌన్ టు ఎర్త్ స్వభావం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. వారు తమ పిల్లలు ఆకాశ్ అంబానీ (Akash Ambani), అనంత్ అంబానీ, ఇషా అంబానీలో సైతం ఈ విలువలను నింపారు. పిల్లల పెంపకం విషయంలో సాధారణ తల్లిదండ్రుల మాదిరిగానే కఠినంగా వ్యవహరించారు.
వాచ్మెన్కు క్షమాపణ చెప్పిన ఆకాశ్ అంబానీ
ముఖేష్ అంబానీ ఒకసారి తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీతో వాచ్మెన్కి క్షమాపణ చెప్పించారు. సిమి గరేవాల్ షోలో పేరెంటింగ్ విధానాల గురించి చర్చ సందర్భంగా నీతా అంబానీ ఆ సంఘటన గురించి పంచుకున్నారు. ఓసారి ఆకాశ్ బిల్డింగ్ వాచ్మెన్తో ఫోన్లో చాలా దురుసుగా మాట్లాడుతున్నాడు. దీన్ని గమనించిన ముకేశ్ అంబానీ వెంటనే ఆశాశ్ను మందలించినట్లుగా నీతా అంబానీ వెల్లడించారు.
అంతటితో ఆగకుండా కొడుకు ఆకాశ్ను కిందకు తీసుకువెళ్లి ఆ వాచ్మెన్కు క్షమాపణ చెప్పించారు. ఈ విషయంలో ముకేశ్ పేరెంటింగ్ స్టైల్ చాలా కఠినంగా ఉందని నీతా వివరించారు. వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలని ముకేశ్ తన పిల్లలకు స్పష్టంగా బోధించారని తెలిపారు. అంబానీ కుటుంబంలో భాగమైనంత మాత్రాన తన పిల్లలను ఎప్పుడు హద్దు దాటనీయలేదని నీతా చెప్పుకొచ్చారు.