కొల్లూరు: భర్త అనారోగ్య సమస్యలు.. వైద్యం కోసం చేసిన అప్పులతో మానసిక వేదనకు గురవుతున్న ఓ వివాహిత ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని తోకలవారిపాలెంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. తోకలవారిపాలేనికి చెందిన వర్రె నాగమల్లేశ్వరరావు పెద్ద కుమార్తె వైష్ణవిని అదే గ్రామానికి చెందిన బంధువు వై. శ్రీనివాసరావుకు ఇచ్చి తొమ్మిదేళ్ల కిందట వివాహం చేశారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య, చిన్నారులైన ఓ కుమారుడు, కుమార్తెతో కలసి గుంటూరులో నివసించేవారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాసరావు గుంటూరు నుంచి వచ్చి తన తల్లిదండ్రులు, భార్య పిల్లలతో కలసి ఉంటున్నాడు. ఉద్యోగ రీత్యా వెళ్లి వస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా వైద్యం కోసం అప్పులు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఆవేదనతో వైష్ణవి కొద్ది రోజులుగా మానసికంగా కుంగిపోతుంది. శనివారం మధ్యహ్నం అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లిన వైష్ణవి తన తండ్రికి అప్పులు, తన భర్త అనారోగ్య సమస్యల గురించి చెప్పి ఆవేదన చెందింది. అన్నీ సర్దుకుంటాయని ధైర్యం చెప్పి పంపారు. సాయంత్రం సమయంలో వైష్ణవి అత్తింటి వద్ద భారీగా జనం ఉండటంతో వెళ్లి చూసిన ఆమె తండ్రి వైష్ణవి ఉరి పెట్టుకొని ఉండటం గమనించాడు. బంధువుల సాయంతో ఆమెను హుటాహుటిన వేమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కిశోర్బాబు తెలిపారు.


