అధికారం, పోలీసులను అడ్డం పెట్టుకుని పేట్రేగుతున్న టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏట్రా అశ్వినీరెడ్డి బాపట్లలో భారీ నిరసన ర్యాలీ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం
టీడీపీ కీచకపర్వంపై కదం తొక్కిన మహిళాలోకం
బాపట్ల: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏట్రా అశ్వినీరెడ్డి పేర్కొన్నారు. గుంటూరులో మహిళపై జరిగిన దాడికి నిరసనగా మహిళలపై దాడులు సిగ్గు చేటు.. చంద్రబాబు నాయుడు డౌన్..డౌన్ అంటూ బాపట్ల పట్టణంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి గడియార స్తంభం మీదుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సర్కిల్ వరకు చేరుకుంది. అనంతరం నిరసన చేపట్టి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.
రెడ్బుక్ రాజ్యాంగం మేరకే దాడులు
అనంతరం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన కార్యాక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏట్రా అశ్వినీరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం మహిళలకు రక్షణ లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. అధికారాన్ని, పోలీసు వ్యవస్థను అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ స్టాంప్ ఉంటే చాలు.. ఏ నేరం చేసినా తమను పోలీసులు కాపాడతారనే ధైర్యం అధికార పార్టీ నాయకుల్లో పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ కార్యాలయమైనా, పోలీస్ స్టేషన్ అయినా పచ్చ స్టాంప్ను చూసి ఎదురుగా సీటు వేయాలని, వారు చెప్పినట్లు వినాలి అన్న పరిస్థితులను రాష్ట్రంలో సృష్టించారని పేర్కొన్నారు. పోలీసులు కేసు పెట్టాలంటే స్థానిక టీడీపీ నాయకుడి అనుమతి తీసుకోవాలా? టీడీపీ నాయకుడు వద్దంటే బాధితులు ఫిర్యాదులను తొక్కిపెడతారా అని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలని, గట్టిగా నిలదీస్తే బాధితులపైనే ఎదురు కేసులు పెట్టే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలకన్నా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగమే వీళ్లకు పరమావధిగా మారిందని పేర్కొన్నారు. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ సెక్షన్లకన్నా నారా చంద్రబాబు సెక్షన్లు, లోకేష్ సెక్షన్లే రాష్ట్రంలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ దారుణాలకు బలైపోతున్నది ప్రధానంగా మహిళలు, చిన్నారులు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలేని చెప్పారు.
వైరల్ అయ్యేంతవరకు స్పందించకపోవడం శోచనీయం
ప్రతిపక్ష కార్యకర్త సోషల్మీడియాలో పోస్టు పెడితే నిమిషాల్లో కేసులు, అర్ధరాత్రి అరెస్టులు జరుగుతున్నాయని, కానీ ఓ మహిళపై అధికార పార్టీ నేత దాడి చేసి, వివస్త్రను చేస్తే.. ఆ వీడియో వైరల్ అయ్యేవరకు పోలీసులు కదలకపోవటం సిగ్గుచేటన్నారు. రాజకీయకక్ష సాధింపులకు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. గుంటూరులో దాడి జరిగి ఇంతకాలం అవుతున్నప్పటికీ పోలీసులు విచారణ చేపట్టకపోవటం ఏమేరకు న్యాయమో అర్ధంకావటం లేదన్నారు. మహిళలు అధైర్యపడొద్దని, వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మహిళా నాయకులు వేల్పుల మీరాభి, కానుగంటి లక్ష్మీరాఘవ, నాగలక్ష్మి, సీతారావమ్మ, శివపార్వతి, గొర్రుముచ్చు పుష్పరాజ్యం, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, నాయకులు కోకి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, నక్కా వీరారెడ్డి, జయభారత్రెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, గంగిశెట్టి రత్తయ్య, నర్రావుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


