
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో మంత్రి సవిత, ఎమ్మెల్యే లోకం మాధవికి చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు(గురువారం, జూన్ 19వ తేదీ) నెల్లిమర్ల పర్యటనకు వచ్చిన వీరిద్దరికీ నిరసన సెగ గట్టిగా తగిలింది. అక్కడకు ఏవో గొప్పలు చెప్పుకుందామని వస్తే.. వారిని మహిళలు ముట్టడించారు. అది కూడా ఖాళీ బిందెలు పట్టుకుని మంత్రిని, ఎమ్మెల్యేని నిలదీసే యత్నం చేశారు.
నెల్లిమర్ల 5వ వార్డు మహిళలు.. తమకు తాగు నీటి సమస్య ఉందని ఎప్పట్నుంచో చెబుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి సవితను ముట్టడించారు. అయితే ఆ బిందెలు లాక్కొని అక్కడకు వచ్చిన మహిళలను పోలీసులు చెదరగొట్టారే కానీ కనీసం తాగు నీరుపై హామీ అయితే ఇవ్వలేకపోయారు మంత్రి, ఎమ్మెల్యే. తమకు హామీ ఇవ్వకుండా వెళ్లిపోయిన మంత్రి, ఎమ్మెల్యేపై మహిళలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగు నీటి సమస్యపై హామీనే ఇవ్వలేకపోయారని, ఇంకేం చేస్తారంటూ మండిపడుతున్నారు.