మద్యం అక్రమ రవాణా కేసులో సిట్కు హైకోర్టులో ఎదురుదెబ్బ
చట్టం విధి విధానాలను దర్యాప్తు బృందం తుంగలో తొక్కిందంటూ వ్యాఖ్య
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ రవాణా కేసులో చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు అరెస్టులే లక్ష్యంగా దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మద్యం అక్రమ రవాణా కేసులో నిందితులు కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వారి అరెస్ట్ను చట్ట విరుద్ధంగా ప్రకటించింది. వీరి అరెస్ట్ విషయంలో చట్టం నిర్దేశించిన విధి విధానాలను సిట్ అధికారులు తుంగలో తొక్కారని ఆక్షేపించింది. సిట్ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోవడం లేదంది. సిట్ దర్యాప్తునకు సహకరించాలని రాజశేఖర్రెడ్డి, వాసుదేవరెడ్డిలను ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు వారి ముందు హాజరు కావాలంది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో తమకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాజశేఖర్రెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమ అరెస్ట్ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ తుహిన్కుమార్ గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో పూర్తి పాఠం తెలియరాలేదు.


