విజయనగరం రూరల్: కోరుకొండ సైనిక పాఠశాలలో వార్షిక ఇంటర్ డ్రిల్ పోటీలు – 2026 ఘనంగా నిర్వహించారు. ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైనిక క్రమశిక్షణ, కచ్ఛితత్వం, మిలటరీ శైలి, జట్టు స్ఫూర్తి, పాఠశాల సాంప్రదాయాన్ని చాటిచెప్పేలా ఈ పోటీలు జరిగాయి. జూనియర్, సీనియర్ విభాగాలకు చెందిన అన్ని హౌస్ల క్యాడెట్లు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. జూనియర్ విభాగంలో కాకతీయ హౌస్ ఉత్తమ మార్చింగ్ ట్రూప్గా ఎంపిక కాగా, హౌస్ కెప్టెన్ జి.గౌతమ్ ఉత్తమ ట్రూప్ కమాండర్ అవార్డును అందుకున్నారు. సీనియర్ విభాగంలో గజపతి హౌస్ ఉత్తమ మార్చింగ్ ట్రూప్గా నిలవగా.. కెప్టెన్ సాయిలోహిత్ ఉత్తమ అవార్డును అందుకున్నారు. అవార్డులను ప్రిన్సిపాల్ ఎస్ఎస్ శాస్త్రి విజేతలకు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వింగ్ కమాండర్ కిరణ్.వి, కెప్టెన్ సెంథిల్కుమార్, సుబేదార్ రవీందర్ కుమార్, హవల్దార్ శ్రవణ్కుమార్ సింగ్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.


