● ‘స్వతంత్ర’ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు
● మంత్రి లోకేశ్ను కాపాడేందుకే ఈ వ్యాఖ్యలంటూ విమర్శలు
విజయనగరం అర్బన్: స్పోర్ట్స్ కోటా జీఓ ఆధారంగా డీఎస్సీ–2025లో జరిగిన నియామకాలకు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు ఎలాంటి సంబంధంలేదని.. అదంతా క్రీడల శాఖ మంత్రి, స్పోర్ట్స్ అథారిటీ పరిధిలోనే జరిగిందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్వతంత్ర ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటాలో 430 నుంచి 460 వరకు ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపు, సర్టిఫికెట్ల పరిశీలనలో తీవ్ర మార్పులు, చేర్పులు జరిగాయని బాధిత అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల్లో నకిలీ పత్రాలు, అక్రమాలు చోటుచేసుకున్నందున ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే.. శ్రీనివాసులునాయుడు మాత్రం ‘అందులో తప్పులు జరిగి ఉంటే అది క్రీడల శాఖది తప్ప, మంత్రి లోకేశ్ది కాదు’ అని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్సీ వ్యాఖ్యలతో అక్రమాలు జరగడం వాస్తవమేనని, కాకపోతే ఆ నిందను లోకేశ్పై పడకుండా క్రీడా శాఖపైకి నెట్టేసే కుట్ర జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, తుది ఫలితాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కుతుంటే, ఇవేవీ పట్టని ఎమ్మెల్సీ ప్రభుత్వం ఇచ్చే స్క్రిప్ట్ను యథాతథంగా చదివేస్తూ ఉపాధ్యాయ సమాజానికి ద్రోహం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీతో ప్రెస్మీట్లు పెట్టించి అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని బాధిత డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.


