విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ నిమిత్తం నిపుణులపైన ముగ్గురు సభ్యులతో హైలెవల్ కమిటీ ఏర్పాటైంది. ప్రమాద స్థలిలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపట్టనుంది. విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజా అప్డేట్స్..
స్టీల్ ప్లాంట్ వద్ద లోకేశ్కు చేదు అనుభవం
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్దకు మంత్రి నారా లోకేశ్
హోం మంత్రి అనితతో ప్లాంట్ వద్దకు వెళ్లిన లోకేశ్
లోకేశ్ ఎదుట నిరసనకు దిగిన కార్మిక సంఘాలు
లోకేశ్ను నిలదీసిన కార్మిక సంఘాలు
నైపుణ్యం లేని కార్మికులకు ఎలా అనుమతి లభించిందని ఆగ్రహం
ఎంపీ భరత్, అనితలు సర్దిచెప్పబోయినా.. వినని కార్మిక సంఘాలు
కార్మికులకు సమాధానం ఇవ్వలేకపోయిన లోకేశ్
వాళ్ల ఆవేదనను అర్థం చేసుకోని లోకేశ్
ఎందుకు గొడవ పడుతున్నారంటూ ఆగ్రహం
ప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేశ్ అసహనం
లోకేశ్ తీరుపై మండిపడ్డ కార్మికులు
👉విశాఖ స్టీల్ప్లాంట్ ఘటనాస్థలిని కేంద్రమంత్రి కుమారస్వామి పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు. విశాఖ స్టీల్ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
👉150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీసుకుంది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది.
👉గత రెండు నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.


