విజిబుల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందిన అశోక్
మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాతోపాటు వీహెచ్, ఈడబ్ల్యూఎస్లోనూ అక్రమాల ఆరోపణలు
సాక్షి, విశాఖపట్నం: మెగా డీఎస్సీలో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారగా.. ఉమ్మడి విశాఖతోపాటు ఇతర జిల్లాల్లోనూ నకిలీ ధ్రువపత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కోటాతోపాటు వీహెచ్ (విజువల్లీ హ్యాండీక్యాప్డ్), ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కేటగిరీల్లోనూ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి, మెరిట్ను పక్కనపెట్టి ఉద్యో గాలు పొందారన్నది పలువురు బాధిత అభ్యర్థుల ప్రధాన ఆరోపణ.
66.6 మార్కులొచ్చినా..
విశాఖకు చెందిన దేవగుటపు సంతోష్ పార్వతి డీఎస్సీ పీజీటీ పరీక్షలో 66.6 మార్కులు (హాల్ టికెట్ నెం. ఎండీఎస్సీ 0124213) సాధించారు. ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు జోన్–1లో 92వ ర్యాంక్ లభించింది. పీజీటీలో మొత్తం 10 పోస్టులు ఉండగా తనకంటే చాలా తక్కువ మార్కులు సాధించిన వ్యక్తికి వీహెచ్ కోటా కింద ఉద్యోగం దక్కడం వల్ల తనకు అవకాశం చేజారిందని ఆమె వాపోతోంది. 46 మార్కులతో 852వ ర్యాంక్ పొందిన అశోక్కుమార్కు (హెచ్టీ నెం.ఎండీఎస్సీ 0242090) ఈడబ్ల్యూఎస్, వీహెచ్ కోటా కింద ఉద్యోగం లభించింది.
తనకు రావాల్సిన ఉద్యోగాన్ని నకిలీ వీహెచ్ సర్టిఫికెట్ ద్వారా పొందినట్లు సంతోష్ పార్వతి ఆరోపిస్తోంది. ఇదే రీతిలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చెందిన భాస్కర్రెడ్డి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో 72.52 మార్కులతో 68వ ర్యాంక్ సాధించినప్పటికీ ఉద్యోగం దక్కలేదని సంతోష్ పార్వతి చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్ నుంచి నకిలీ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ తెచ్చుకున్న గోనెగుంట సుభాషిణి టెట్ అర్హత కూడా లేకపోయినా 48 మార్కులతో ఉద్యోగం పొందారని ఆమె ఆరోపిస్తున్నారు.
మరోవైపు మదనపల్లికి చెందిన అంజనప్పకు ఒక కన్ను లేకపోయినా.. వైద్య పరీక్షల్లో 30 శాతం వైకల్యమే ఉన్నట్లు నిర్ధారించడంతో ఉద్యోగం ఇవ్వలేదని బాధిత అభ్యర్థులు చెబుతున్నారు. రీ–వెరిఫికేషన్లో 40 శాతం వైకల్యం ఉన్నట్లు తేలిందని పేర్కొంటున్నారు. తనకు ఇది చివరి డీఎస్సీ అని, వయసు కారణంగా మరోసారి పరీక్ష రాసే అవకాశం లేదని పార్వతి చెబుతున్నారు. బంగారం తాకట్టు పెట్టి సుమారు రూ.60 వేల వరకు ఖర్చు చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు.
700 మందికిపైగా నష్టపోయారా?
రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ సాధించి 1 : 1 నిష్పత్తిలో వెరిఫికేషన్కు హాజరైన 700 మందికిపైగా అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి లోకేశ్తోపాటు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మండిపడుతున్నారు.


