సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా మరో రూ.1,950 కోట్లు అప్పుకు గ్యారంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.1,000 కోట్లు ప్రత్యేక టర్మ్ రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.
అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఏపీ ట్రాన్స్కో రూ.950 కోట్లు మీడియం టర్మ్ రుణంగా తీసుకునేందుకు గ్యారంటీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ హామీ.. రుణ కాల వ్యవధి మొత్తానికి చెల్లుబాటులో ఉంటుంది. అలాగే అసలు, వడ్డీకి కూడా ప్రభుత్వ హామీ వర్తిస్తుంది. రుణ సంస్థలకు చెల్లించడంలో విఫలమైన సందర్భంలో ప్రభుత్వ హామీ అమల్లోకి వస్తుంది.


