Tirumala: నేడు రామకృష్ణ తీర్థ ముక్కోటి | Tirumala: Sri Ramakrishna Theertha Mukkoti on January 25 | Sakshi
Sakshi News home page

Tirumala: నేడు రామకృష్ణ తీర్థ ముక్కోటి

Jan 25 2024 8:18 AM | Updated on Jan 25 2024 8:19 AM

Tirumala: Sri Ramakrishna Theertha Mukkoti on January 25 - Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో12 కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న మంగళవారం  65,991 మంది స్వామివారిని దర్శించుకోగా 21,959 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.57 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి
తిరుమలలో జనవరి 25న గురువారం  ఉద‌యం 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు త‌దిత‌ర‌ పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ‌తారు. అక్క‌డున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు.

కాగా, అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధుల శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని అట‌వీ మార్గంలో ఈ తీర్థానికి న‌డిచి వెళ్ల‌డానికి అనుమ‌తి లేదు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ దాదాపు 35 బస్సులను ఏర్పాటు చేస్తోంది. గురువారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు. ఈ తీర్థానికి వెళ్లే యాత్రికుల‌కు టీటీడీ అన్న‌ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో పాలు, కాఫీ, పొంగ‌ళి, ఉప్మా, సాంబార‌న్నం, పెరుగన్నం పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement