టీటీడీ చరిత్రలో తొలిసారిగా.. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు | Tirumala Sets New Record July 2026 Hundi Collections | Sakshi
Sakshi News home page

టీటీడీ చరిత్రలో తొలిసారిగా.. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు

Aug 4 2026 7:17 AM | Updated on Aug 4 2026 11:13 AM

Tirumala Sets New Record July 2026 Hundi Collections

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులు సమర్పిస్తున్న హుండీ కానుకలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. టీటీడీ చరిత్రలో తొలి సారిగా జూలైలో అత్యధికంగా రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం నమోదైంది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి జూలై వరకు స్వామివారికి హుండీ ద్వారా లభించిన మొత్తం ఆదాయం రూ.861 కోట్లకు చేరుకుంది. సాధారణంగా రోజుకు రూ.3 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుండగా, రద్దీ రోజుల్లో అది రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైగా నమోదవుతోంది. 

రూ.120 కోట్లకు పైగా.. 
ఈ ఏడాది జనవరి నుంచి హుండీ ఆదాయం స్థిరంగా అధిక స్థాయిలో నమోదవుతోంది. జనవరిలో రూ.124 కోట్లు, ఫిబ్రవరిలో రూ.106 కోట్లు, మార్చిలో రూ.125 కోట్లు, ఏప్రిల్‌లో రూ.115 కోట్లు, మేలో రూ.120 కోట్లు, జూన్‌లో రూ.128 కోట్లు, జూలైలో అత్యధికంగా రూ.140.28 కోట్లు హుండీ ద్వారా లభించింది. గత ఏడు నెలల్లో ఐదు నెలలు రూ.120 కోట్ల మార్కును దాటడం విశేషంగా నిలిచింది.

పెరిగిన ఆదాయం 
ప్రస్తుత ఏడాది తొలి ఏడు నెలల్లో సుమారు 1.62 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా జూలైలో రెండు రోజులు హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్కును దాటగా, అనేక రోజుల్లో రూ.4 కోట్లకు పైగా నమోదైంది. ఈ కారణంగానే నెలవారీ హుండీ ఆదాయం తొలిసారిగా రూ.140 కోట్ల మార్కును అధిగమించింది.

ఈ ఏడాది కొత్త రికార్డుకు అవకాశం 
రానున్న బ్రహ్మోత్సవాలు, సెలవు దినాలు, పండుగల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో హుండీ సమర్పణలు కొనసాగితే, 2026లో శ్రీవారికి హుండీ ద్వారా ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అధిక ఆదాయం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement