కాలినడకన తిరుమల కొండెక్కిన 116 ఏళ్ల బామ్మ! | 116 yrs Old Woman Climbs Tirumala Steps | Sakshi
Sakshi News home page

కాలినడకన తిరుమల కొండెక్కిన 116 ఏళ్ల బామ్మ!

Jul 7 2026 11:23 AM | Updated on Jul 7 2026 11:40 AM

116 yrs Old Woman Climbs Tirumala Steps

116 ఏళ్ల వయస్సులో కాలినడకన 

తిరుమలకు చేరుకున్న వృద్ధురాలు 

ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసిన టీటీడీ  

తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అచంచలమైన భక్తితో 116 ఏళ్ల వయస్సులో కాలినడకన తిరుమలకు చేరుకున్న తమిళనాడుకు చెందిన వృద్ధ భక్తురాలు నవనీతమ్మకు టీటీడీ సోమవారం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది. ఇటీవల కాలినడకన తిరుమలకు వెళ్తున్న నవనీతమ్మ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఆమె భక్తిని పలువురు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో సీఎం తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో భక్తికి, వయస్సు అడ్డు రాలేదని, శ్రీవారిపై భక్తులకు ఉన్న విశ్వాసానికి ఈ వృద్ధురాలే నిదర్శనమని పోస్ట్‌ చేశారు.

ఈ క్రమంలో వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయాలని టీటీడీ చైర్మన్‌ ఆదివారం ఎక్స్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు. చైర్మన్‌ సూచనల మేరకు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి చెన్నైకి చెందిన నవనీతమ్మను గుర్తించి వారిని సంప్రదించారు. 

చైర్మన్‌ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్‌ దర్శనం ఏర్పాటు చేశారు. టీటీడీ సిబ్బంది స్వయంగా ఆమెను బయోమెట్రిక్‌ కేంద్రం నుంచి దర్శనం వరకు వెంట ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వృద్ధ భక్తురాలికి వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement