వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి ధ్వజం
మల్లయ్య కొండలపై మూడు ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలి
ఖనిజ సంపద దోచుకునేందుకు బాబు సర్కార్ యత్నాలు
మీ తప్పిదాన్ని గత ప్రభుత్వంపై మోపేందుకు యత్నిస్తే ప్రజలు క్షమించరు
సాక్షి, మదనపల్లె: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండల్లో మైనింగ్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ చేయబోమని మాటల్లో కాకుండా, ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి చేతల్లో చిత్తశుద్ధి చూపించాలని డిమాండ్ చేశారు. మైనింగ్ లైసెన్సులను ఎప్పుడు రద్దు చేస్తారో ప్రకటించాలని సోమవారం ఆయన డిమాండ్ చేశారు. మల్లయ్య కొండల సముదాయంలోని సాధుకొండ, శివపురం, ఎర్రకొండల్లో మైనింగ్ కోసం ఉత్తర్వులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? అని సూటిగా ప్రశ్నించారు.
మైనింగ్ లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబే
మల్లయ్య కొండకు సంబంధించి 2025 నవంబర్ 27న చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి మైనింగ్ లైసెన్సులు జారీ చేసిందని మిథున్రెడ్డి వెల్లడించారు. ఎర్రకొండకు ‘సీఎల్’ ఇచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాదని చెప్పారు. తాజాగా బాబు ప్రభుత్వం సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ సంస్థకు అప్పగిస్తూ ఉత్తర్వు జారీ చేసిందని చెప్పారు. ‘ఇది నిజం కాదా?
టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు దాచిపెట్టి ఆ తప్పిదాన్ని గత ప్రభుత్వంపై నెట్టడం ఏమిటి?’ అని నిలదీశారు. మల్లయ్య కొండల్లో మైనింగ్పై ఇప్పటికే జారీ చేసిన మూడు ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రతి తప్పిదాన్ని గత ప్రభుత్వంపై మోపేందుకు యత్నిస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా, ఖనిజ సంపదను దోచుకోవాలని చంద్రబాబు సర్కార్ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. మల్లయ్యకొండ అభివృద్ధి కోసం పైసా ఇవ్వని బాబు సర్కారు మైనింగ్ పేరుతో దోపిడీకి సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ అభివృద్ధి కోసం రూ.కోట్లాది నిధులను మంజూరు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేని స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదనే విషయం అందరికీ తెలుసన్నారు.


