కురబలకోట : మండలంలోని రంగమ్మ చెరువు అభివృద్ధి పనుల ముసుగులో అధికార పార్టీకి చెందిన అనుబంధ కాంట్రాక్టర్.. చెరువు మట్టిని టిప్పర్లతో తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆ చెరువు దగ్గర భూములున్న రైతులు అధికారులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. చెరువు అభివృద్ధికి ఇరిగేషన్ అధికారులు రూ.5.38 లక్షలు మంజూరు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువును ఆనుకుని ఉన్న భూముల్లో మట్టి ఎత్తి టిప్పర్ల ద్వారా తరలిస్తూ ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ భూములకు తోలుతున్నారని రైతులు తెలిపారు. చెరువును ఆనుకుని నిర్దేశిత దూరం వరకు ఎలాంటి తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్నా.. వాటిని తుంగలో తొక్కి చెరువు మట్టి తోలి వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. చెరువు అభివృద్ధి పేరుతో మట్టి దోపిడీకి అధికారులు అవకాశం కల్పించినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకుని మట్టి దోపిడీని అరికట్టాలని బాధిత రైతులు కోరారు.
అధికారులకు రైతుల ఫిర్యాదు


