● రుధిర ధారల త్యాగాల పురిటిగడ్డ.. ఉక్కు పిడికిలి బిగించిన మదనపల్లె!
● జనగణమన శృతి లయల వేదిక.. బాపూజీ పాదస్పర్శతో పునీతమైన నేల!
● బ్రిటిష్ గుండెల్లో నిద్రపోయిన
సమరయోధులు.
● నేడు స్వాతంత్య్ర సంబరాల వేళ
ప్రత్యేక స్మరణ!
మదనపల్లె సిటీ: ‘మా భూమి.. మా దేశం.. మా ప్రాంతం.. మా సొత్తు.. మా మనుషులు’ అనే ఉగ్ర నినాదం గుండెగుండెనా దావానలంలా రగిలింది. శతాబ్దాల పరాయి పాలన బంధాలను తెంచి, స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఎందరో వీరనారీమణులు, మహనీయులు తమ నెత్తురును ధారపోసి సాధించుకున్న అఖండ భారతదేశం నేడు 80వ వసంతంలోకి సగర్వంగా అడుగుపెడుతోంది. దేశమంతటా ‘హర్ ఘర్ తిరంగా’ వెల్లువతో ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా విజయకేతనమై రెపరెపలాడుతోంది. నాటి రక్తాక్షరాల సమరంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రదర్శించిన వీరత్వం, రగిలించిన ఉద్యమస్ఫూర్తి భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగింది. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి మహా ఉద్యమాలు దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. ఈ గడ్డపై పుట్టిన ధీరులు బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచారు. ఉద్యమాలే ఊపిరిగా, కఠిన జైలు జీవితాలనే దినచర్యగా మార్చుకుని, మాతృభూమి దాస్య శృంఖలాలను తెంచిన మదనపల్లె పోరాట పటిమను, ఇక్కడి చారిత్రక సాక్ష్యాలను స్మరించుకుంటూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం.


