
కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేయండి
హైకోర్టులో సజ్జల దివాకర్రెడ్డి కుటుంబసభ్యుల పిటిషన్ నేడు విచారణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె (సీకేదిన్నె) మండలం మద్దిమడుగు గ్రామ పరిధిలో తమకు చెందిన 63.72 ఎకరాల భూమిని స్వాదీనం చేసుకుంటూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నెల 21న ఇచ్చిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపేయాలని కోరుతూ సజ్జల దివాకర్రెడ్డి కుమారుడు సందీప్రెడ్డి, భార్య భగీరథి, మరో సోదరుడు సజ్జల జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి విజయకుమారి, అల్లుడు వై.సత్యసందీప్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సీకేదిన్నె మండల పరిధి పలు సర్వే నంబర్లలో తమకున్న 201.17 ఎకరాల విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.
రికార్డుల ప్రకారం మావన్నీ వ్యవసాయ భూములే
దశాబ్దాల నుంచి తమ స్వాదీనంలో ఉన్న వ్యవసాయ భూములను అధికారులు ఇప్పుడు అటవీ భూములుగా చెబుతున్నారని పిటిషనర్లు వివరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం కూడా అవన్నీ వ్యవసాయ భూములేనని తెలిపారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చాయని.. అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారని తెలిపారు. చాలా భూములను రిజిష్టర్ డీడ్ల ద్వారా కొన్నట్లు పేర్కొన్నారు.
రెవెన్యూ రికార్డుల్లో ఇవన్నీ వ్యవసాయ భూములుగానే ఉన్నాయి తప్ప పోరంబోకు భూములుగా లేవన్నారు. వాటిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని, 201.17 ఎకరాలు తమవేనని నిరూపించేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తమ చట్టబద్ధ హక్కుల విషయంలో జోక్యం చేసుకుంటోందని తెలిపారు.
అన్నీ అటవీ భూముల బయటే ఉన్నాయి
ఇన్ని దశాబ్దాల్లో ఏ ప్రభుత్వం గానీ, ఏ అధికారి గానీ తమ భూముల విషయంలో జోక్యం చేసుకోలేదని సందీప్రెడ్డి తదితరులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అటవీ శాఖ హద్దులన్నీ కూడా తమ భూముల వెలుపలే ఉన్నట్లు పేర్కొన్నారు. అటవీ అధికారులు కూడా ఎన్నడూ తమ భూమిని అటవీ భూమిగా చెప్పలేదన్నారు. తమ భూముల్లో నిర్మాణాలకు సంబంధిత శాఖల అధికారులు అన్ని అనుమతులు మంజూరు చేశారని, వాటిలో నివాస గృహాలు, సర్వెంట్ రూమ్లు ఉన్నాయని, సకాలంలో పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు.
సంయుక్త సర్వేలోనూ అటవీ భూమి కాదని తేలింది
రెవెన్యూ, అటవీ శాఖ సంయుక్త సర్వేలోనూ తమ భూమలు అటవీ భూములు కావని తేలిందని పిటిషనర్లు వివరించారు. తమ భూముల హద్దులేవీ అటవీ భూముల్లో లేవని తేల్చారన్నారు. సంయుక్త సర్వే నివేదికతో పాటు తమవద్ద ఉన్న అన్ని రికార్డులను జిల్లా కలెక్టర్ ముందుంచినా... వాటిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. 63.72 ఎకరాలను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ, స్వాదీనం చేసుకోవాలంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చారని, ఆ వెంటనే భూముల నుంచి తమను ఖాళీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారని వివరించారు. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యరి్థంచారు.