కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.
సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వినియోగదారులు 08562 242457కు కాల్ చేయాలని సంబంధిత అధికారులు కోరారు.
జేఎన్టీయూలో
అందుబాటులోకి ఏఐ కోర్సులు
కలికిరి: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్(ఏఐ) కోర్సు అందుబాటులోకి వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అత్యాధునిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి ఉన్న డిమాండ్తో సీట్ల సంఖ్యను రెట్టింపు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో 66 సీట్లుండగా ప్రస్తుతం వీటి సంఖ్యలో 132కు పెంచినట్లు తెలిపారు. కళాశాలల వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 528 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు ఈఏపీసెట్ కౌన్సెలింగ్లో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రెడ్డెమ్మ ఆలయం..
భక్తజన సందోహం
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడమ్మ అంటూ వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. భక్తులు ఆలయంలో అన్నదానాలు చేశారు.


