సాక్షి, గుంటూరు: కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులు వేధించారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అతని మృతిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేసును రాజీ చేసుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. సాయికృష్ణ చనిపోయిన విషయం చంద్రబాబు, వవన్ కల్యాణ్లకు తెలుసని అంబటి రాంబాబు అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అంబటి రాంబాబు గుంటూరులో మాట్లాడారు. సాయి కృష్ణ వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి ఘటన గతంలో దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. సాయి కృష్ణ మృతదేహాన్ని దహనం చేయడమనేది దారుణం అని రాంబాబు పేర్కొన్నారు.
మేము దీన్నిరాజకీయం చేయాలని అనుకోవడం లేదు. ఒక తల్లి ఆవేదన చెబుతున్నాం. సాయి కృష్ణ రౌడీ అని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. చంద్రబాబు సీరియస్ అంటూ రాస్తున్నారు. ఒక సీనియర్ ఐపిఎస్ చేత విచారణ ప్రభుత్వం అంటుంది. సాయికేష్ణ బ్రతికి లేడు. సీనియర్ ఐపిఎస్ విచారణలో ఏం తేలుస్తారో నేను చెబుతాను వినండి. సాయి కృష్ణ చాలా కేసులో నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్ వార్ లో ఏమై పోయాడో తెలియదు అని నివేదిక ఇస్తారని అంబటి పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పిఎస్ లో జరిగింది. సాయికృష్ణ చంపిన తర్వాత ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు సి ఐ నాగరాజు చెప్పాడు. హోంమంత్రి, డిజిపి, సిపి అందరూ కలిసే మృతదేహాన్ని దహనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటిది హత్య అయితే రెండో నేరం మృతదేహం దహనం చేయడం. పవన్ కల్యాణ్ అమాయకుడో నాకు తెలియదు. ఆయన సమక్షంలోనే సీనియర్ ఐపిఎస్ చేత విచారణ జరిపిస్తారా? చంద్రబాబుకు ఇది న్యాయమేనా అని అంబటి ప్రశ్నించారు.
ఈ కేసును సిబిఐ విచారణ జరిపించాలని, విజయవాడ పోలీస్ కమీషనర్ ను సస్పెండ్ చేయాలి. ఈ కేసులో ఎవరెవరూ ఉన్నారో అందరికి శిక్షపడాలి. పవన్ కల్యాణ్ డూడూ బసవన్నలా తల ఊపుతున్నాడు. పవన్ కల్యాణ్ వాట్సప్ నంబర్ పంపితే ఆ తల్లి ఆవేదన పంపుతాను. చంద్రబాబుకి మనస్సు లేదు. పవన్ కల్యాణైనా స్పందిస్తాడని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.


