ఫిబ్రవరి 4న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి | RATHASAPTHAMI AT SRI GOVINDARAJA SWAMY TEMPLE | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 4న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి

Jan 27 2025 8:01 AM | Updated on Jan 27 2025 8:01 AM

RATHASAPTHAMI AT SRI GOVINDARAJA SWAMY TEMPLE

తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారు దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

తెల్లవారు జామున 3 నుండి 5 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో శ్రీగోవిందరాజస్వామి వారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.

ఉదయం 8 నుండి 9 గంటల వరకు హంస వాహనం, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పెద్దశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2.30 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం, మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.

రాత్రి 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు గరుడ వాహనాన్ని అధిష్టించి శ్రీవారు దర్శనమిస్తారు. రథసప్తమి వేడుకలను అర్ధ బ్రహ్మోత్సవమని, ఒక రోజు బ్రహ్మోత్సవమని కూడా భక్తులు అంటారు.

 

TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి రెండు కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు74,742 మంది స్వామివారిని దర్శించుకోగా 22,466 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు.దర్శన టిక్కెట్లు లేని భక్తులకు  6 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement