
20 ఏళ్ల నాటి లాడ్జీలు, సత్రాలకు విద్యుత్తు తొలగింపు
కప్పం కోసం లాడ్జీ నిర్వాహకులకు బెదిరింపులు
అనుమతులు లేవంటూ మూడు నెలలుగా వేధింపులు
ఆళ్లగడ్డ: దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో ‘బీ – ట్యాక్స్’ కోసం పచ్చముఠాలు అరాచకాలకు తెగబడుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు లాడ్జీలు, సత్రాల నిర్వాహకులను కప్పం కట్టాలంటూ వేధిస్తున్నారు. ముడుపుల కోసం మూడు నెలలుగా అధికార యంత్రాంగంతో రకరకాలుగా బెదిరించినా దారికి రాకపోవడంతో అహోబిలంలో లాడ్జీలకు మంగళవారం తెల్లవారుజామున కరెంట్ తొలగించారు. ఇదంతా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ రెడ్బుక్ కుట్రలేనని స్థానికులు అంటున్నారు.
బీ ట్యాక్స్ మాట్లాడుకోవాలంటూ..
అహోబిలం క్షేత్రం పరిధిలో సొంత పట్టా పొలాలు లేవు. అయినప్పటికీ సుమారు 50 సంవత్సరాలుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అహోబిలంలో చిన్న, పెద్ద లాడ్జీలు, సత్రాలు కలిపి సుమారు 100 వరకు నిరి్మంచుకుని పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటిపై కన్నేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ‘బీ ట్యాక్స్’ వసూలు బాధ్యతను ‘వలస తమ్ముడు’ గుంటూరు శ్రీనుకు అప్పగించారు. తొలుత పంచాయతీ సెక్రటరీ ద్వారా లాడ్జీల నిర్వాహకులకు నోటీసులు ఇప్పించారు.
ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న తమకు ఇప్పుడు నోటీసులు ఏమిటని వారు తెల్లబోవడంతో ‘అన్న’ దగ్గరకు వెళ్లి బీ ట్యాక్స్ గురించి మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. అయినా దారికి రాకపోవడంతో అధికారులతో సర్వే చేయించారు. అహోబిలంలో ఒక్కో లాడ్జీ నుంచి రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేయవచ్చని ‘బీ’ గ్యాంగ్ భావించింది. అయితే ఎంత బెదిరించినా దారికి రాకపోవడంతో లాడ్జీలకు కరెంట్ కట్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
ఆందోళనకు గురైన లైన్మెన్ సెలవుపై వెళ్లిపోగా అధికారులు ఆళ్లగడ్డ నుంచి ప్రైవేటు సిబ్బందిని రప్పించి మూడు నాలుగు లాడ్జీలకు కరెంట్ కట్ చేశారు. ఈలోగా తెల్లవారడం, స్థానికులు తిరగబడటంతో విద్యుత్ అధికారులు జారుకున్నారు. 20 ఏళ్లుగా మీటర్లు ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా సక్రమంగా బిల్లులు కడుతుంటే కనెక్షన్లు ఎలా తొలగిస్తారంటూ లాడ్జీల నిర్వాహకులు విద్యుత్ అధికారులను నిలదీశారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే
‘అహోబిలంలో అనుమతులు లేకుండా లాడ్జీలు నిర్మించుకున్నారని, విద్యుత్ కనెక్షన్ కట్ చేయాలని పంచాయతీ సెక్రటరీ మాకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి డీఈఈ ఆదేశాలతో కట్ చేశాం’ అని ఏఈ వెంకటకృష్ణ చెప్పారు.