తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది | Nandyal Constable Farooq Incident | Sakshi
Sakshi News home page

తల్లితో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం.. హత్యకు ప్లాన్ చేసిన కూతురు..!

Apr 19 2025 12:15 PM | Updated on Apr 19 2025 12:17 PM

Nandyal Constable Farooq Incident

ఆక్టోపస్‌ కానిస్టేబుల్‌ మృతదేహం లభ్యం  

పథకం ప్రకారం హత్య చేయించిన ప్రియురాలు  

కూతురుతో కూడా సన్నిహితంగా ఉండడాన్ని సహించలేక ఘాతుకం

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌ కనిపించడం లేదంటూ అతని భార్య, బంధువులు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో మిస్‌ అయిన కానిస్టేబుల్‌ నంద్యాల–కడప ఘాట్‌రోడ్‌లో శుక్రవారం శవమై కనిపించాడు. 

సేకరించిన వివరాల మేరకు నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, తోటకందుకూరు గ్రామానికి చెందిన ఫారుక్‌ (30) ఏపీఎస్పీ రెండో బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా మంగళగిరి ఆక్టోపస్‌ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి పట్టణంలోనే ఉంటున్నాడు.  ఏప్రిల్‌ 8న ట్రైనింగ్‌ ఉందంటూ వెళ్లిన ఫారుక్‌ తిరిగి రాకపోవడం, ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడంతో 12న భార్య బషీరున్‌ తన బంధువులతో కలిసి ఆక్టోపస్‌ కార్యాలయానికి వెళ్లింది. ఏప్రిల్‌ 9 నుంచి 12 వరకు ఫారుక్‌ సెలవు పెట్టాడని అక్కడి అధికారులు చెప్పడంతో మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఈనెల 14న ఫిర్యాదు చేశారు. మంగళగిరి పట్టణ పోలీసులు మిస్సింగ్‌గా కేసు నమోదు చేశారు.  

విచారణలో వెలుగు చూసిన నిజాలు  
ఫారుక్‌  ఫోన్‌ స్విచ్చాఫ్‌గా ఉండడంతో ఆక్టోపస్‌ అధికారుల ఆదేశాల మేరకు అతని కాల్‌ డేటాను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న కాల్స్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. ఫారుక్‌ ఫోన్‌ లొకేషన్‌ నంద్యాలలో ఉన్నట్లు తేలడంతో చివరగా ఫోన్‌ చేసిన వారిని నంద్యాల జిల్లా పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు చెందిన అనీషను కూడా విచారణ చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. 

ఫారుక్‌కు పెళ్లికాక ముందు నుంచి అనీషతో పరిచయముంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అనీష కుమార్తెతో కూడా ఫారుక్‌ సన్నిహితంగా ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఈ విషయమై ఫారుక్‌తో తరచూ గొడవ పడేది.  ఫారుక్‌ నంద్యాలలోని తెలిసిన వ్యక్తి ద్వారా అనీషకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో అనీష కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఫారుక్‌ను అడ్డు తొలగిస్తేనే పెళ్లికి అంగీకరిస్తానని అనీష చెప్పింది.  

పథకం ప్రకారం..  
ఫారుక్‌ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం పన్నారు. అతనికి ఫోన్‌ చేసి కొన్ని రోజులు సెలవు పెట్టుకుని రావాలని అనీష  కోరింది. ఫారుక్‌ మంగళగిరి నుంచి నంద్యాలకు ఏప్రిల్‌ 8న సాయంత్రం బయలు దేరాడు. 9న అక్కడకు చేరుకున్న ఫారుక్‌ తనకు పరిచయమున్న వ్యక్తిని కలిశాడు. అక్కడి నుంచి బయటకు వెళ్దామంటూ ఆ వ్యక్తి మరో ఇద్దరిని తీసుకుని ఫారుక్‌తో కారులో బయలుదేరారు. మద్యం సేవించిన అనంతరం నంద్యాలలో కారులో వెళుతుండగా ఎదురు సీట్లో కూర్చున్న ఫారుక్‌ను వెనుక ఉన్న వ్యక్తి ఓ వైర్‌తో మెడకు గట్టిగా బిగించాడు. దీంతో ఊపిరి ఆడక ఫారుక్‌ అక్కడికక్కడే మరణించారు. 

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వీరు మృతదేహాన్ని ఒక కవర్‌లో చుట్టి నంద్యాల శివారు ప్రాంతంలో ఉన్న ఓ చెరువులో పడవేశారు. కొంత సమయం తరువాత వచ్చి చూడడంతో మృతదేహాన్ని కవర్‌తో చుట్టడం వల్ల చెరువులో తేలుతూ కనబడింది. మరుసటి రోజు ఎవరూ లేని సమయంలో వచ్చి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి నంద్యాల – కడప ఘాట్‌రోడ్‌లో ఫారెస్ట్‌ ప్రాంతంలో పైనుంచి కిందకు పడవేశారు. నంద్యాల సీసీఎస్‌ పోలీసులు అనీషను, మరో ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకోగా, మరో యువకుడు పరారయ్యాడు. ఆ ముగ్గురిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితులు తెలిపిన వివరాలతో ఫారుక్‌ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫారుక్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement