
భవానీపురం(విజయవాడపశ్చిమ)/రాజమహేంద్రవరం సిటీ: కాపు సామాజికవర్గంపై దాడులు జరుగుతుంటే పవన్కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాపులపై పవన్కు ప్రేమ ఉంటే మంత్రి అంబటిపై దాడిని ఖండించాలని డిమాండ్ చేశారు.
మంత్రి అంబటిపై దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. వెలంపల్లి మాట్లాడుతూ బలహీనంగా ఉన్న టీడీపీని బతికించాలనుకోవడం పవన్ అవివేకమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మాట్లాడుతూ అంబటిపై దాడిని ఖండించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేతలు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో కాపు జేఏసీ ర్యాలీ
మంత్రి అంబటిపై దాడి దుర్మార్గమని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కాపు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జేఏసీ నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. కాపు జేఏసీ నేతలు నందెపు శ్రీనివాస్, యాళ్ల సురేష్, మానే దొరబాబు, అడపా అనిల్, రాయవరపు గోపాలకృష్ణ, ఆకుల ప్రకాష్, వలవల దుర్గాప్రసాద్, నామన వాసు, బురిడీ త్రిమూర్తులు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.