
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి.. ఒడిశా సరిహద్దు తీర ప్రాంతాల్లో విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించింది.
మరోవైపు రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 23న అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.