జూన్–జూలైలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43% లోటు వర్షపాతం
రానున్న 2–3 వారాలపాటు అక్కడక్కడా చిరుజల్లులకే అవకాశం
రుతుపవనాలు బలహీనపడటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఇప్పటికే 17 జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన భూగర్భ జలమట్టాలు.. హైదరాబాద్లో రెడ్ జోన్లు కుత్బుల్లాపూర్ వంటి చోట్ల 37 మీటర్లకు నీటిమట్టాలు పతనం
20 జిల్లాల్లో తీవ్ర వర్షపాత లోటు
సాగు పనుల్లేక వ్యవసాయ కూలీల జీవనోపాధికి ఇబ్బందులు
నారు కోసం బకెట్లతో నీరు..
బకెట్లో నీళ్లు తీసుకొచ్చి వరినారుపై చల్లుతున్న ఈ రైతు పేరు నూనావత్ శ్రీను. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ప్యాటగడ్డ గ్రామ పరిధిలోని ఎర్రగుంట తండాకు చెందిన శ్రీను తనకున్న 2 ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు సిద్ధమవగా వరుణుడు కరుణించకపోవడంతో ఇలా బకెట్తో నీళ్లు తెచ్చి చల్లుతూ నారును కాపాడుకోవడానికి శ్రమిస్తున్నాడు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో కరువు పరిస్థితులు వేగంగా కమ్ముకొస్తున్నాయి. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల వివిధ పంటల నాట్ల కోసం సిద్ధం చేస్తున్న విత్తనాలు ఎండిపోతున్నాయి. ఈ నెలాఖరు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీజీడీపీఎస్) విడుదల చేసిన తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
నిలిచిన సాగు పనులు..
తెలంగాణ నీటిపారుదల శాఖ నివేదికల ప్రకారం జూన్–జూలై నెలల్లో సగటున 22% వరకు వర్షపాతం లోటు ఏర్పడగా కొన్ని ప్రాంతాల్లో ఇది 43% వరకు ఉంది. సాధారణంగా జూలై నాటికి ఊపందుకోవాల్సిన వ్యవసాయ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనివల్ల ఖరీఫ్ పంటల సాగు 22% వరకు పడిపోయినట్లు ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. ఆలస్యమైన వర్షాలు, ఎండల తీవ్రతకు ఇప్పటికే వేసిన పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తక మాడిపోతున్నాయి. దీనివల్ల రైతులు అదనపు విద్యుత్, డీజిల్ ఖర్చులను భరిస్తూ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వ్యవసాయ పనులు మందగించడం వలన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పనులు దొరకక జీవనోపాధికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా నివేదికలు ఏం చెబుతున్నాయి...
⇒ ఐఎండీ అంచనాల ప్రకారం ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా సగటు కంటే 36% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రానున్న 2–3 వారాలపాటు అక్కడక్కడా మాత్రమే చిరుజల్లులు కురుస్తాయి.
⇒ ఇప్పటికే రాష్ట్రంలోని 20 జిల్లాలు తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. మేడ్చల్–మల్కాజ్గిరిలో అత్యధికంగా 48%, హైదరాబాద్లో 25% లోటు నమోదైంది.
⇒ సీడబ్ల్యూసీ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలోని 8 ప్రధాన రిజర్వాయర్లలో (నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల తదితర) 12.92% నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది దేశంలోనే అత్యంత అట్టడుగు స్థాయి. స్థానికంగా వర్షాలు లేకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా, గోదావరి నదుల్లోకి వచ్చే వరద నీటిపైనే రాష్ట్ర రైతులు ఆశలు పెట్టుకున్నారు.
⇒ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు గతేడాదితో పోలిస్తే భారీగా పడిపోయాయి.
⇒ హైదరాబాద్లో గతేడాది 9.96 మీటర్లుగా ఉన్న భూగర్భ జలాల లోతు ప్రస్తుతం 12.43 మీటర్లకు పడిపోయింది. కుత్బుల్లాపూర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 37 మీటర్ల లోతుకు నీటి మట్టాలు పడిపోవడంతో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.
సంక్షోభం ముంగిట వానాకాలం పంటలు...
⇒ గత నెల, ఈ నెలలో వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే పోసిన వరి నారుమడులు ముదిరిపోయి ఎండిపోయే దశకు చేరుకున్నాయి.
⇒నేలలో తగినంత తేమ లేకపోవడం వల్ల పత్తి, మక్కజొన్న, పప్పుధాన్యాలు, సోయాబీన్ వంటి ఖరీఫ్ పంటల విత్తనాలు నాటడం బాగా ఆలస్యమైంది
⇒నీటి లభ్యత లేనందున రైతులు తక్కువ కాలపరిమితి గల, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ మెట్ట పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది
⇒ ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ నివేదిక ప్రకారం తెలంగాణ సహా భారత్లో వ్యవసాయ ఆదాయాలు పడిపోయి, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం ఉంది.
⇒ వర్షాల తగ్గుదల వల్ల దేశవ్యాప్తంగా జలవిద్యుత్ ఉత్పత్తి 10% నుండి 15% వరకు క్షీణించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.


