పాలనలో ఫెయిల్‌.. అందుకే ఈ డైవర్షన్‌ | A conspiracy to divert public attention from administrative failures | Sakshi
Sakshi News home page

పాలనలో ఫెయిల్‌.. అందుకే ఈ డైవర్షన్‌

Jun 10 2025 4:07 AM | Updated on Jun 10 2025 7:03 AM

A conspiracy to divert public attention from administrative failures

మహిళలను కించపరుస్తూ ఈటీవీ ప్రసారం చేసిన కథనం

బురద రాజకీయం బాబు జట్టుకే చెల్లు.. మాటలూ, చేతలూ తీవ్ర అభ్యంతరకరం 

మహిళలను అవమానించడమే టీడీపీ విష సంస్కృతి 

రాష్ట్ర మహిళలను కించపరిచింది ఈటీవీనే 

ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే సాక్షిపై అక్రమ కేసులు 

సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో పక్కాగా డైవర్షన్‌ కుట్ర

సాక్షి, అమరావతి: మహిళలు అంటే ఏమాత్రం గౌరవంలేని చంద్రబాబు, టీడీపీ నేతలు ఒక్కసారిగా నక్కజిత్తులతో సూక్తి ముక్తావళి వల్లిస్తుండటం తాజా రాజకీయ వైచిత్రి. తమ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుయుక్తిలో భాగంగానే ఈ పన్నాగానికి తెరతీశారు. అసలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, బావమరిది బాలకృష్ణతో సహా ఆ పార్టీ నేతలు ఏనాడూ మహిళలకు తగిన గౌరవం ఇవ్వలేదనన్నది బహిరంగ రహస్యం. 2014–2019 మధ్య చంద్రబాబు సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ స్వయంగా వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైన  తీరు అందరికీ గుర్తింది. 

‘కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దంటుందా’ అని ఆయన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. తద్వారా కుమార్తెలను తక్కువ చేసి అవమానించారు. స్త్రీ పురుష సమానత్వం కోసం అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. ఇక చంద్రబాబు బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తాను తన బావకంటే నాలుగాకులు ఎక్కువే చదివానన్నట్టుగా వ్యవహరించారు. ‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని ఓ సినిమా వేడుకలో వేదిక ఎక్కి మరీ అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్‌ అటు తండ్రినీ ఇటు మామనూ మించిపోయారు. విదేశాల్లో ఆయన పలువురు యువతులతో స్విమ్మింగ్‌ పూల్‌లో సాగించిన వ్యవహారాలు ఫొటోలు, వీడియోలతో సహా వెలుగులోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. పైగా బాలకృష్ణ ఓ చానల్‌ కోసం నిర్వహించే రియాల్టీ షోలో పాల్గొన్న చంద్రబాబు తన కుమారుడి బాగోతాన్ని వెనకేసుకువచ్చారు. బాలకృష్ణ కూడా లోకేశ్‌కే వంతపాడారు. ప్రస్తుతం హోమ్‌ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గతంలో టీడీపీ సభల్లో ప్రసంగిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మ, సతీమణి వైఎస్‌ భారతి గురించి అసభ్యకరంగా వ్యాఖ్యానించారు. 

ఓ మహిళ, అందులోనూ ప్రజాప్రతినిధిగా చేసిన ఆమె సాటి మహిళలను పత్రికల్లో రాయలేని భాషతో అసభ్యకరంగా మాట్లాడటం విభ్రాంతి కలిగించింది. అదే టీడీపీ సంస్కృతి అని ఆ పార్టీ వర్గాలు ఘనంగా చెప్పుకోవడం మరింత విస్మయానికి గురి చేసింది. అటువంటి చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్, అనిత ప్రస్తుతం ఒక్కసారిగా మహిళలపై లేని ఆపేక్షను చూపిస్తూ కొంగజపం చేస్తుండటం టీడీపీ కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం.

» టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఓ మహిళా తహశీల్దార్‌ జట్టు పట్టుకుని మరీ ఈడ్చుకొచ్చి దాడి చేశారు. అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎమ్మెల్యే చింతమనేని అరచకానికి అండగా నిలిచారు. తహశీల్దార్‌ వనజాక్షిని బెదిరించి మరీ పంచాయతీ చేశారు.

» 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు రాష్ట్రాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయినా సరే ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం కోసం మాత్రం రోజుకో డ్రామాకు తెరతీస్తున్నారు.

నివేదికలను ప్రస్తావించి.. మహిళలను కించపరిచిన ఈటీవీ..
సాక్షి టీవీ చానల్‌ చర్చా గోష్టిలో ఆ టీవీ ప్రతినిధులు ఎవరూ మహిళలను కించపరిచేలా మాట్లాడనే లేదు. ఓ స్వతంత్ర విశ్లేషకుడు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా అనే ఆంగ్ల పత్రిక ప్రచురించిన నివేదికను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను వారించారు. సాక్షి టీవీ యాజమాన్యం వెంటనే స్పందించి ఆ స్వతంత్ర విశ్లేషకుడి వ్యాఖ్యలతో తమకే మాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. 

వైఎస్సార్‌సీపీ కూడా ఆయన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయినా సరే వక్రీకరిస్తూ సాక్షి టీవీ యాజమాన్యం, కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పలువురు పరిశీలకులు గతంలో ఈటీవీ ప్రసారం చేసిన ఓ వార్తా కథనాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యభిచారం, ఎయిడ్స్‌ వ్యాప్తిపై ఓ నివేదిక వెల్లడించిందంటూ ఈటీవీ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. యావత్‌ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కథనాన్ని ప్రసారం చేయడం గమనార్హం. 

ఎవరో స్వతంత్ర విశ్లేషకుడు చెప్పింది కాదు.. ఈటీవీ స్వయంగా రూపొందించిన వార్తా కథనంగా ప్రసారం చేసింది. అసలు రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా ఏదైనా చానల్‌ వార్త కథనాన్ని ప్రసారం చేసిందంటే అది ఈటీవీ మాత్రమేనని పరిశీకులు స్పష్టం చేస్తున్నారు. ఈటీవీ ప్రసారం చేసిన ఆ వార్తా కథనం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అటువంటి దిగజారుడు పాత్రికేయం చంద్రబాబుకు ఇంపుగా కనిపిస్తుంది. ఎందుకంటే అది తన రాజగురువు రామోజీ కుటుంబం నిర్వహిస్తున్న చానల్‌. కానీ ఎవర్నీ కించపరచకుండా, గౌరవమైన రీతిలో చార్చా గోష్టి నిర్వహించే సాక్షి టీవీపై మాత్రం అక్రమ కేసు నమోదు చేయడం టీడీపీ మార్కు కుతంత్రం.

బాబు గుండెల్లో రైళ్లు
» పతిపక్ష వైఎస్సార్‌సీపీ  ఈ నెల 4న నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంతో ప్రభుత్వ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ కూటమి ప్రభుత్వ పుట్టి మునగడం ఖాయమని చంద్రబాబు గుర్తించారు.  
»  డైవర్షన్‌ రాజకీయాల కోసం కాచుకుని ఉన్న చంద్రబాబు ఈ నెల 6న సాక్షి టీవీ నిర్వహించిన చర్చా గోష్టిని వక్రీకరిస్తూ కుట్రకు తెరతీశారు. సాక్షి టీవీలో చర్చా గోష్టి ముగిసిన 24 గంటల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రానికి తెరతీశారు.  బాబు ఆదేశాలతో టీడీపీ సోషల్‌ మీడియా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి, వైఎస్సార్‌సీపీకి ఆపాదిస్తూ టీడీపీ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాన్ని వైరల్‌ చేసింది. టీడీపీ అనుకూల టీవీ చానళ్లు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతి, టీవీ 5 తదితర చానళ్ల ద్వారా వైఎస్సార్‌సీపీపై విష ప్రచారానికి పాల్పడ్డారు.  
»  చంద్రబాబు కుట్రలో భాగంగా మంత్రి లోకేశ్‌ తెరపైకి వచ్చారు.  సాక్షి టీవీ, వైఎస్సార్‌సీపీపై నిరాధార ఆరోపణలు చేశారు. ఆ వెంటనే టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనల పేరుతో గూండాగిరీకి పాల్పడ్డాయి.  చర్చా గోష్టిలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో తమకే మాత్రం సంబంధం లేదని సాక్షి టీవీ యాజమాన్యం ఖండించింది.  వాస్తవానికి అంతటితో ఆ అంశం ముగిసిపోయినట్టే. కానీ చంద్రబాబు కుట్ర మరోలా ఉంది. 
» జూన్‌ 8 (ఆదివారం) కూడా ఈ అంశంపై రాద్ధాంతం కొనసాగేలా  కఠిన చర్యలు తీసుకుంటామని  చంద్రబాబు స్వయంగా ఎక్స్‌(ట్విట్టర్‌) ఖాతాలో కామెంట్‌ పోస్టు చేశారు. ఫలితంగా అక్రమ కేసులు, సాక్షిపై దాడులు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement