బొత్స సవాల్‌.. నీళ్లు నమిలిన పయ్యావుల.. వైఎస్సార్సీపీ వాకౌట్‌ | AP Assembly Sessions Legislative Council News Sep 25th Updates | Sakshi
Sakshi News home page

బొత్స సవాల్‌.. నీళ్లు నమిలిన పయ్యావుల.. వైఎస్సార్సీపీ వాకౌట్‌

Sep 25 2025 11:27 AM | Updated on Sep 25 2025 12:21 PM

AP Assembly Sessions Legislative Council News Sep 25th Updates

సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చ కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్‌సీపీకి మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ నీళ్లు నమిలారు. ఒకానొక దశలో సహనం కోల్పోయిన ఆయన రాజకీయ విమర్శలు దిగారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

పీఆర్సీ పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపుపై చర్చలో భాగంగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయేలు, కల్పలత తొలుత మాట్లాడారు. ఉద్యోగులకు 30 వేల కోట్లు ఉన్నాయి. నేటి వరకు పీఆర్సీ చైర్మన్ నియామకం లేదు. పరిశీలిస్తామంటూ మంత్రి దాట వేస్తున్నారు. నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. ప్రతీ పండుగకు ఉద్యోగులకు డీఏ కోసం ఎదురుచూస్తున్నారు.. 

..ఈ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్ లో పెట్టింది.. పెన్షనర్స్ ఒక్కొక్కరికీ 15 నుంచి 20 లక్షల బకాయిలు పెట్టారు. గతంలో జగన్ వచ్చిన 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి బకాయిలు చెల్లించాలి. ఇప్పటివరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత చెల్లింపులు చేశారో చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. దీనికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌(AP Finance Minister Payyavula Keshav) సమధానమిస్తూ.. 

గతంలో రివర్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వీళ్ళదే(వైస్సార్‌సీపీ సభ్యులను చూపిస్తూ..). ఉద్యోగులు మాకు కొత్త జీతాలు వద్దు పాత జీతాలే ఇవ్వండని బ్రతిమిలాడుకునే పరిస్థితికి తెచ్చారు. గతంలో ఒక మంత్రి మీకు 15వ తేదీ కల్లా జీతాలు ఇస్తున్నాం కదా అని హేళనగా మాట్లాడారు. ప్రభుత్వ మార్పుకు ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఒప్పుకుంటున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం మాకు మద్దతు ఇచ్చారు. గత ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ము ప్రభుత్వం వాడేసుకుంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది వైసీపీ సభ్యుల తీరు. మా ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చిత్తశుధ్దితోనే ఉంది. పీఆర్సీని కమిషన్‌ డిసైడ్‌ చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. 

పయ్యావుల వ్యాఖ్యలకు విపక్షనేత బొత్స సత్యనారాయణ ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. పీఆర్సీ కమిషన్‌ రద్దు చేశారు. వీళ్లు ఒత్తిడి చేశారో.. వాళ్లు రిజైన్‌ చేశారో తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తోంది. ఉద్యోగుల శ్రేయస్సు కోరే వారై అయితే ఇప్పటికే కమిషన్‌ వేసేవారు. ఆర్థిక మంత్రి అడిగిన ప్రశ్నకు రాజకీయ కోణంలో సమాధానం చెప్పారు. ప్రభుత్వాలు మారాయి.. అటు ఉన్నవాళ్ళు ఇటు వచ్చారు.. ఇటు ఉన్నవాళ్ళు అటు వెళ్ళారు. గత ప్రభుత్వ హయాంలో 27 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో పీఆర్సీ కమిషన్ వేస్తారా.. ఫిట్మెంట్ ఇస్తారా అనేది చెప్పాలి. అప్పులు ఎవరు ఎంత చేశారు అనేది డిబేట్ లో మాట్లాడటానికి సిద్ధం. ఎవరు దేనికి ఎంత ఖర్చు పెట్టారో చర్చిద్దాం. అన్నీ రికార్డు ప్రకారమే మాట్లాడుకుందాం అని సవాల్‌ విసిరారు. అయితే దీనికి మంత్రి పయ్యావుల నుంచి స్పందన రాలేదు. దీంతో పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుకు నిదర్శనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్‌ చేశారు.

అంతకు ముందు.. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అలాగే మహిళలు, చిన్నారుల అదృశ్యాలపై చర్చించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ఛైర్మన్ మోషేన్ రాజు దానిని తిరస్కరించారు.

ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఖబడ్దార్‌

Advertisement
 
Advertisement
Advertisement