ఈ ప్రాణం ఖరీదెంత? | 11-Year-Old Boy Electrocuted in Kadapa | Sakshi
Sakshi News home page

ఈ ప్రాణం ఖరీదెంత?

Aug 22 2024 9:38 AM | Updated on Aug 22 2024 1:22 PM

11-Year-Old Boy Electrocuted in Kadapa

కరెంట్‌ వైర్లు తగిలి విద్యార్ధి దుర్మరణం

మరో విద్యార్థికి తీవ్రగాయాలు

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణం

మధ్యాహ్నం ఒంటిగంట సమయం..
బడి గంట కొట్టగానే వడివడిగా బయటికొచ్చారా దోస్తులు..  
రోజులాగే ఒకే సైకిల్‌పై 
ఇళ్లకు బయలుదేరారు..  
చక్రాలు జోరుగా 
ముందుకు కదిలాయి..  
కాళ్లు చేతులూ ఆడిస్తున్నారు.. 
ఎప్పట్లాగే ఏంచక్కా 
ముచ్చట్లాడుతున్నారు.. 
నవ్వుతూ.. తూలుతూ
ముందుకు సాగుతున్నారు...  

ఒక్క క్షణం..  ఒకే ఒక్క క్షణం..  
తలో దిక్కు పడ్డారు..  
అందాక ఆడిన ఆ కాళ్లూ చేతులు కదలకుండా పడి ఉన్నాయి.. 
మాటలు మూగబోయాయి..  
నవ్వులు ఎప్పుడో
మాయమయ్యాయి..  
ఉన్నట్లుండి చిన్నారుల శరీరంపై 
మంటలు..  

ఏమైంది..  
ఏమవుతుంది.... 
ఆ పాత కథే..  
ప్రజా భద్రత ప్రశ్నార్థకంగా మారి.. 
తీగలా అల్లుకుపోయిన 
నిర్లక్ష్యపు కథే... 

అధికారుల అలసత్వం అనాలా..  
ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అనాలా..  
ఎవరినంటేనేం.. ఏమంటేనేం..  
వందేళ్లు బతకాల్సిన
ఓ నిండు ప్రాణం 
మొగ్గలోనే నేల రాలింది... 
‘ఊపిరి’ పోసుకునేందుకు 
మరో ప్రాణం తల్లడిల్లుతోంది.... 

ఈ పాపం ఎవరిది...? 
ఈ శిక్ష ఎవరికి..?  
రోడ్లపై గుంతలా పూడ్చరు.. 
మురుగు కాలువ వైపు
అస్సలు తొంగి చూడరు..  
గజిబిజిగా కరెంటు వైర్లు..   
గందరగోళంగా కనెక్షన్లు..  
పని పనికో ఖరీదు కడతారు... 
ప్రతి సర్వీసుకో బేరమాడతారు!  

ఈ నిండు ప్రాణం ఖరీదెంత? 
ఆ కుటుంబం 
జీవితాంతం పడే వేదనంత!  
పిల్లాడొస్తాడని గుమ్మం కాడే నిలబడి చూసే తల్లి  ఎదురుచూపులంత!

ఈ నిర్లక్ష్యం వెల ఎంత? 
పోయిన ప్రాణాన్ని 
తిరిగి తీసుకురాలేనంత.. 
జీవించే హక్కును కాలరాసేంత...   

నిన్న మురుగు కాలువ.. 
నేడు కరెంటు తీగ..
పిల్లల పాలిట
మృత్యు పాశాలవుతున్నాయ్‌..
తల్లిదండ్రుల జీవితానికి సరిపడా చేదు జ్ఞాపకాలు మిగిలిస్తున్నాయ్‌..   

కడప అర్బన్‌ : తెలిసీ తెలియని వయసు పిల్లలు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని సైకిల్‌లో మధ్యాహ్నం తాము చదువుతున్న పాఠశాల నుంచి ఇంటికి బయలు దేరారు. విద్యుత్‌ సరఫరా ఉన్న కరెంట్‌ లైన్‌కున్న తీగ వేలాడుతూ వీరికి చుట్టుకుంది. అంతే తమకు తెలియకుండానే ప్రమాదానికి గురయ్యారు. శరీరంపై యమపాశంలా విద్యుత్‌ తీగ పడుతుందని భావించలేకపోయారు. మంటలు చెలరేగాయి. 

వీరిద్దరి శరీరాలపై విద్యుత్‌ తీగ పడిన ప్రదేశమంతా కాలిపోయాయి. ఆ సమయంలో అదే వీధిగుండా ద్విచక్రవాహనంలో వస్తున్న వ్యక్తి వెంటనే ఈ దృశ్యాన్ని చూసి వెంటనే మరో వ్యక్తితో కలిసి కట్టెతో విద్యుత్‌తీగను వేరు చేశారు. స్థానిక ప్రజల సహకారంతో ఇద్దరు పిల్లలను కడప నగరంలోని క్రిస్టియన్‌లైన్‌లో ఉన్న హోలిస్టిక్‌ హాస్పిటల్‌లో చికిత్స కోసం తరలించారు. సంఘటన స్థలాన్ని, ఆసుపత్రిని కడప టూటౌన్‌ సీఐ బి. నాగార్జున, ఎస్‌ఐ ఎస్‌కెఎం హుసేన్‌ తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు.

క్షణాల్లో సంఘటన ..
క్షణాలలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బెల్లంమండివీధిలో నివాసం ఉంటున్న అబ్దుల్‌ రహిమాన్‌ పెద్దకుమారుడు ఖురేషి తంజువుర్‌ రహిమాన్‌ (11) హాస్పిటల్‌కు తీసుకొచ్చిన కొంతసేపటికి మృతి చెందాడు. మరోబాలుడు ఆటోడ్రైవర్‌ అజ్మత్‌ఆలీ చిన్నకుమారుడు షేక్‌ అద్నాన్‌ (11) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరు సైకిల్‌పై ప్రతి రోజూ తమ ఇంటి నుంచి బయలుదేరి రోడ్డుకు అవతలవైపు ఇంటర్నేషనల్‌ కల్యాణమండపం సమీపంలో ఉన్న విద్యాసాగర్‌ స్కూల్‌లో ఐదోతరగతి చదువుతున్నారు. 

బుధవారం కూడా సైకిల్‌పై తమ స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో టైటానిక్‌ బిల్డింగ్‌ లైన్‌లో విద్యుత్‌ తీగ వేలాడుతూ ఉండటం గమనించలేకపోయారు. విద్యుత్‌ తీగ తగలడంతోనే సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు కుప్పకూలిపడిపోవడం, మంటలన్నీ వ్యాపించడం క్షణాల్లో జరిగిపోయాయి. విద్యుత్‌ అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యమే ఈ విషాద ఘటనకు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. విద్యుత్‌ ప్రమాదం సంఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి మర్రెడ్డి అనురాధ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద సంఘటన వివరాలను కడప లోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి అద్నాన్‌ తండ్రి ఆజ్మత్‌ ఆలీని, కుటుంబసభ్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.

నా కుమారుడిని బ్రతికించండి సార్‌ : అద్నాన్‌ తండ్రి  
నా కుమారుడు అద్నాన్, తన స్నేహితుడు రహిమాన్‌తో కలిసి ఐదోతరగతి చదువుతున్నాడు. ఇద్దరు కలిసి మెలిసి సైకిల్‌లో స్కూల్‌కు వెళ్లి వచ్చేవారు. అలాంటిది కరెంట్‌ తీగ తగిలి రహిమాన్‌ చనిపోవడం, తన కుమారుడు తీవ్రంగా గాయపడటం బాధాకరం. నా  కుమారుడిని ఎలాగైనా బ్రతికించండి అంటూ వైద్యులను వేడుకుంటున్నాడు.   

స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా విద్యుత్‌ ప్రమాదాలను నివారిస్తాం 
– ఎమ్మెల్యే మాధవి  
కడప నగరంలో ఇష్టానుసారంగా రోడ్లకు సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్‌ స్తంభాలతోపాటు, ఇతర సంస్థలకు సంబంధించిన వైర్లు కూడా చుట్టి ఉన్నాయనీ తమ పరిశీలనలో తేలింది. స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా అడ్డదిడ్డంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లను, విద్యుత్‌ స్థంభాలను విద్యుత్‌ అధికారుల ద్వారా తొలగింపచేస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థి మృతికి వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు.   

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement