● హంపాపురం సబ్స్టేషన్ వద్ద
రైతుల ఆందోళన
రాప్తాడు రూరల్: మండల పరిధిలోని హంపాపురం గ్రామ సబ్స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి ఫీడర్ పరిధిలోని రైతులు గురువారం హంపాపురం సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రోజుకు 9 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ అందించడం లేదని, కేవలం 7 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపల్లి ఫీడర్ పరిధిలోని గొందిరెడ్డిపల్లి, హంపాపురం, గొల్లపల్లి, ఎర్రగుంట గ్రామాల రైతులు కొన్ని రోజులుగా తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో 9 గంటల పాటు విద్యుత్ అందుతుండగా, తమకు మాత్రం కేవలం 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. మూడు గంటలు, నాలుగు గంటల చొప్పున విడతల వారీగా సరఫరా చేస్తూ, మధ్యలో తరచూ కోతలు విధిస్తున్నారన్నారు. రెండు రోజులుగా మూడు గంటలకు పైగా అదనపు కోతలు విధించడంతో పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో బోర్లపైనే ఆధారపడి పంటలను కాపాడుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలతో లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వేరుశనగ, టమాట, అరటి, చీనీ తదితర పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను సంబంధిత విద్యుత్శాఖ ఏఈ దృష్టికి తీసుకెళ్తే, ‘కరెంటు వచ్చినప్పుడే వాడుకోవాలి, మా వల్ల ఏమీ కాదు‘ అనే నిర్లక్ష్యపూరిత సమాధానం చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


