అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా పరిధిలోని 44 పీఎం శ్రీ పాఠశాలలకు 2026–27 విద్యా సంవత్సరంలో వివిధ విద్యా కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.1,57,35,000 నిధులు మంజూరు చేసింది. పాఠశాలలకు కేటాయించిన నిధులను మార్గదర్శకాలకు అనుగుణంగా, పారదర్శకంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగించాలని డీఈఓ అయూబ్ హుస్సేన్, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ సూచించారు. సోమవారం సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాలలకు మంజూరైన వివిధ గ్రాంట్లు, వాటి వినియోగంపై సమావేశంలో ఏఎంఓ వేణుగోపాల్, అసిస్టెంట్ ఏఎంఓ ఫణిరాజ్ వివరించారు.
విద్యా విహార యాత్రలకూ నిధులు
వార్షిక గ్రాంట్లతో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, గ్రీన్ స్కూల్, జాతీయ దినోత్సవాల నిర్వహణ, నో బ్యాగ్ డే, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ కార్యక్రమం, బాల సంసద్, విద్యా విహార యాత్రలు తదితర కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్లు వారు తెలిపారు. మంజూరైన నిధులతో చేపట్టే ప్రతి ఖర్చు, దానికి సంబంధించిన వివరాలను యాప్, పోర్టల్లో నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
13 నుంచి ఆర్జిత కల్యాణోత్సవాలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13, 16, 17, 18, 20, 23, 24, 25, 27, 30, 31 తేదీల్లో కలాణోత్సవాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆర్జిత కల్యాణోత్సవ టిక్కెట్ రూ. 6,500గా నిర్ణయించామని, ఒక్కో టికెట్పై ఐదుగురిని అనుమతిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు నేరుగా ఖాద్రీ ఆలయంలో సంప్రదించవచ్చన్నారు. లేకపోతే ఆన్లైన్లోనూ కల్యాణోత్సవ టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 9000490670, 9441860432 సంప్రదించాలన్నారు.
సరిహద్దు దాటిన
తుంగభద్ర జలాలు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాలు ఎట్టకేలకు బొమ్మనహాళ్లోని ఆంధ్ర సరిహద్దును దాటాయి. జలాశయం నుంచి తాగునీటి అవసరాల కోసం ఈ నెల 1న 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు 4వ తేదీ నాటికి బొమ్మనహాళ్ సరిహద్దులోని 105వ కి.మీ వద్ద ఉన్న రెగ్యులేటర్ వద్దకు చేరింది. దీంతో సరిహద్దు ప్రాంతంలో నీటి రాక ప్రారంభమైంది. అయితే హెచ్చెల్సీ మరమ్మతుల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి ఇండెంట్ తీసుకుంటామని అనంతపురం అధికారులు బోర్డు అధికారులకు నివేదించారు. దీంతో సోమవారం ఉదయం 6.30 గంటలకు సరిహద్దులో ఉన్న జలాలను గేట్లు ఎత్తి ఆంధ్రలోకి స్వాగతించారు. ప్రస్తుతం జలాశయం నుంచి సుమారు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


