● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
ఉరవకొండ: జిల్లాలో పశుగ్రాసం కరువై మూగజీవాలు అల్లాడుతున్నా పట్టించుకోరా అంటూ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. మంగళవారం ఎమ్మెల్సీ ఒక ప్రకటన విడుదల చేశారు. కరువు పీడిత అనంతపురం జిల్లాలో ప్రస్తుతం పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి గ్రాసం కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం లారీ గడ్డి రూ.30 వేల నుంచి రూ.32 వేలు పలుకుతోందన్నారు. పశుగ్రాసం దొరక్క రైతులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం కనీసం దాణా కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన చేయకపోవడం దుర్మార్గమన్నారు. చాలా మంది పశువులను పోషించుకోలేక కబేళాలకు తరలిస్తున్నారని, పశువులకు గ్రాసం దొరక్క కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు తింటూ వ్యాధుల బారిన పడుతున్నాయని వాపోయారు. అధికారులు వెంటనే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


