● ప్రహసనంలా అర్హత నిరూపణ
● ధ్రువీకరణ పత్రాల సమర్పణకు పోటెత్తిన ఓటర్లు
రాయదుర్గంటౌన్: ‘సర్’ సర్వే ఒక ఎత్తయితే.. నోటీసులు అందుకుంటున్న వారు అర్హత నిరూపించుకోవడం మరో ఎత్తుగా మారింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, వివరాలు తప్పుగా ఉన్న, అనుమానాస్పద, గత ఎస్ఐఆర్ జాబితాతో పోల్చితే ప్రస్తుత జాబితాలో ఇంటి పేరు, అక్షర దోషాలు ఉన్నట్లు రాయదుర్గం నియోజకవర్గంలో గుర్తించిన దాదాపు 40,524 మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు బీఎల్ఓల ద్వారా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ బూత్ల వారీగా జనరేట్ చేసిన నోటీసులను తేదీల వారీగా ఓటర్లకు అందజేసి విచారణతోపాటు అర్హత నిరూపించుకునేందుకు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ధ్రువీకరణపత్రాల్లో ఏదో ఒక సరైన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ధ్రువీకరణపత్రాలు సమర్పించే కార్యక్రమం రాయదుర్గం మున్సిపాలిటీలో మంగళవారం నుంచి ప్రారంభమైంది. మునిసపల్ కమిషనర్ దివాకర్రెడ్డితోపాటు ఎంపీడీఓ కొండన్న, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ మురళీమోహన్ను ఏఈఆర్ఓలుగా నియమించారు. తొలిరోజు వందలాదిమంది ఓటర్లు తమ అర్హత నిరూపణ కోసం ధ్రువీకరణపత్రాలను తీసుకురావడంతో ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. పట్టణంలో దాదాపు 9,349 మందికి నోటీసులు జారీ చేశారు. ధ్రువీకరణపత్రాల విచారణ కార్యక్రమం సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని, ఓటర్లు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల సంఘం సూచించిన 11 ధ్రువీకరణపత్రాల్లో ఒక్కటి సమర్పించినా సరిపోతుందని సూచించారు. రోజుకు 400–500 మంది దాకా ఓటర్ల ధ్రువీకరణ జరుగుతున్నట్లు చెప్పారు.


