● ఆయా – వర్కర్ మధ్య కోల్డ్వార్తో విసిగిపోయిన జనం
కణేకల్లు: మండల కేంద్రంలోని 12వ అంగన్వాడీ కేంద్రంలో వర్కర్ లత, ఆయా సలీమ మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య గత ఐదారు నెలల నుంచి కోల్డ్ వార్ జరుగుతోంది. నిత్యం గొడవలకు దిగుతుండటంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థలతో తమ పిల్లలు ఆటపాటలు, చదువులకు దూరమవుతున్నారంటూ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులు అంగన్వాడీకి సైతం పంపడం లేదు. రోజూ 5 నుంచి 10 మంది లోపే చిన్నారులు వెళుతున్నారు. ఆయాపై కోపంగా ఉంటున్న వర్కర్ గత 20 రోజుల నుంచి ఆయాను కేంద్రంలోకి రానివ్వకుండా లోపల తాళం వేసుకొని కూర్చునేది. ఈ విషయమై ఆయా బయటి నుంచి ప్రశ్నిస్తూ గొడవపడి బయటే ఉంటూ డ్యూటీ ముగించుకొని ఇంటికెళ్లేది. విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో వర్కర్పై తీవ్ర కోపంగా ఉన్న ఆయా ప్రతీకారంగా గురువారం అంగన్వాడీ కేంద్రానికి బయట నుంచి తాళం వేసి ఆందోళనకు దిగింది. పరస్పర దూషణలతో అంగన్వాడీ కేంద్రం రణరంగంగా మారింది. స్థానికులు అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరుకొని ఆందోళనలు చేశారు. ఆలస్యంగా అక్కడికి చేరుకొన్న సూపర్వైజర్ ఈశ్వరమ్మ ఇద్దరిని మందలించి తాళాలు తీయించింది. 12వ అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది మధ్య వార్ జరుగుతున్నా సీడీపీఓ ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంపై చిన్నారుల తల్లీదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదారు నెలల నుండి వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొని అంగన్వాడీ కేంద్ర నిర్వహణ అస్తవ్యస్తంగా మారినా సీడీపీఓ, సూపర్వైజర్లు ప్రేక్షకపాత్ర వహించడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.


