ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేతల దౌర్జన్యకాండను నిరసిస్తూ ఈనెల 31న ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన కురుబ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కౌడిగి గోవిందు అల్లుడు జయకుమార్ వేల్పుమడుగు పొలం సర్వే నం.141లోని 21 ఎకరాల పొలం కొనుగోలు చేస్తే , ఆపొలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని టీడీపీ నేతలు మంత్రి కేశవ్ డైరెక్షన్తో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ రైతును పొలంలోకి వెళ్లకుండా చేస్తున్న అధికారులపైనా చట్టపరమైనచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొలంపై జయకుమార్కు సర్వహక్కులున్నాయని, జిల్లా కోర్టు, హైకోర్టు, సివిల్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. దీనిపై అనేక మార్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓలను కలిసి విన్నవించినట్లు తెలిపారు. రైతు తన పొలంలో వేసిన మూడు బోర్లు, పైప్లు టీడీపీ నేతలు ధ్వంసం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు డిష్ సురేష్, కౌడిగి గోవిందు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ అసిస్టెంట్పై వేటు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న జూనియర్ అసిస్టెంట్ రమణారెడ్డిపై కలెక్టర్ ఆనంద్ సస్పెన్షన్ వేటు వేశారు. రమణారెడ్డిని తక్షణం సస్పెండ్ చేస్తూనే ఆయన వివరణ తీసుకుని, తదుపరి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని జేడీఏ ఎన్.సాలురెడ్డిని ఆదేశించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు ధ్రువీకరించాయి.
ప్రొఫెసర్లను
విచారించిన సీబీ సీఐడీ
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లను సీబీ సీఐడీ అధికారులు శుక్రవారం విచారణ చేశారు. గతంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి మూల్యాంకనం చేసిన ప్రొఫెసర్ల వివరాలను ఆరా తీసి, జవాబు పత్రాల్లో పెట్టిన సంతకం.. తాజాగా నమోదు చేస్తున్న సంతకాన్ని పోల్చి చూశారు. అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రొఫెసర్ల సంతకాలను సరిపోల్చి చూస్తున్నట్లు తెలిసింది.
ఇక జేసీ ఆగడాలు సాగనివ్వం
పెద్దవడుగూరు: ‘నా ఊపిరి ఉన్నంత వరకూ జేసీ ప్రభాకర్రెడ్డి ఆగడాలు సాగనివ్వను’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మేడిమాకులపల్లిలో వైస్సార్సీపీ నేత చితంబరరెడ్డిని కలిసి మాట్లాడారు. ఇటీవల జేసీ ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో కలిసి చితంబరరెడ్డి ఇంటి వద్ద హల్చల్ చేసిన విషయం విదితమే. దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి అండతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రౌడీలను, గూండాలను ఉసిగొల్పి గ్రామాల్లో కక్షలు ప్రేరేపిస్తున్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఇటీవల మదన్మోహన్రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టడం, అధికార పార్టీ వాళ్లకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం సరికాదన్నారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలను పిలిపించి బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేస్తే పోలీసులు కౌంటర్ కేసు నమోదు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎద్దుల శరభారెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్రెడ్డి, సూర్యప్రభాకర్రెడ్డి, కొట్టాలపల్లి హరినాథరెడ్డి, గుత్తి అనంతపురం గోవర్ధన్రెడ్డి, మోహన్రెడ్డి, మహేష్రెడ్డి, చింతలచెరువు భాస్కర్రెడ్డి, శేఖర్, రాజాకొండయ్య, రంగేశ్వరెడ్డి, సజ్జలదిన్నె రాజు, కొండారెడ్డి పాల్గొన్నారు.


