● సర్వజనాస్పత్రి వైద్యులను హెచ్చరించిన కలెక్టర్
అనంతపురం సిటీ: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులను కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని సెమినార్ హాలులో శుక్రవారం సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిటీ ఉపాధ్యక్షుడు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గత సమావేశంలో చేసిన తీర్మానాల అమలు ప్రగతి, ప్రస్తుతం అవసరమైన సౌకర్యాల కల్పన ప్రతిపాదనలపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గత సమావేశంలో తీర్మానించిన పనులు పెండింగ్లో ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒప్పందం మేరకు సిబ్బందిని పెంచని సెక్యూరిటీ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆదేశించారు. వ్యక్తిగత విద్వేషాలను పక్కన పెట్టి రోగులకు మానవతా దృక్పథంతో సేవలందించాలన్నారు. ఆస్పత్రి క్యాంటీన్ అనుమతి ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు, వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపడాలని, తాగునీటి సమస్య రాకుండా చూడాలని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం జరుగుతున్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ, అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ బెనడిక్ట్, డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ డాక్టర్ నవీన్కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ జస్వంత్రావు, ఈఈ రామ్మోహన్, హెచ్డీఎస్ కమిటీ సభ్యులు విశా ఫెర్రర్, ఓ.రత్నమయ్య, మిద్దెల నరసింహులు, కొప్పల వెంకటరమణయ్య, వివిధ విభాగాధిపతులు, వైద్యులు పాల్గొన్నారు.


