● బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్ల వద్ద రైతుల పడిగాపులు
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద సాగు చేసిన పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. మీసేవ కేంద్రాల్లో అలాంటి సదుపాయం లేకపోవడం, కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ) ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియకపోవడంతో రైతులు తికమక పడుతున్నారు. అక్కడక్కడ పని చేస్తున్నా సర్వర్లు సతాయింపుతో నెమ్మదిగా సాగుతుండడంతో రైతులు ప్రీమియం చెల్లింపు కోసం గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
● జిల్లా వ్యాప్తంగా 50 వేల హెక్టార్ల వరకు కంది పంట వేశారు. 20 వేల హెక్టార్లలో పత్తి, 15 వేల హెక్టార్లలో వేరుశనగ, మిగతాది ఆముదం, మొక్కజొన్న సాగు చేశారు. దీంతో ఇప్పుడు కంది, పత్తి, ఆముదం పంటకు బదులు పంట మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొత్తగా సాగు చేసిన పంటకు తమ వాటా కింద ప్రీమియం చెల్లిస్తే బీమా పథకాలు వర్తించనున్నాయి. ఫసల్బీమా కింద వరి, కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం, మిరప పంటలు ఉండగా.. వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, దానిమ్మ, చీనీ, బత్తాయి, అరటి, టమాట పంటలు ఉన్నాయి. వరికి ఆగస్టు 15 వరకు గడువు ఉండగా.. మిగతా అన్ని పంటలకూ ఈ నెలాఖరులోపు ప్రీమియం చెల్లించాలని గడువు ఉంది. అసలే ఎల్–నినో పరిస్థితులు ఉన్నందున పంట చేతికిరాని సమయంలో కనీసం బీమా పరిహారమైనా వస్తుందనే ఆశతో ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు.
పంట మార్పిడి ధ్రువీకరణకు అవస్థలు
ఖరీఫ్లో దాదాపు వేరుశనగ పేరుతో బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకోవడం ఇప్పుడు రైతులకు సమస్యగా మారింది. సాగు చేసినట్లు ఈ–క్రాప్లో నమోదైన పంటకే ప్రీమియం చెల్లించినట్లుగా ఉండాలనే నిబంధన ఉండటంతో పంట మార్పిడి ధ్రువీకరణ కోసం ఇప్పుడు బ్యాంకులకు పరుగులు తీసి అవస్థలు పడాల్సి వస్తోంది. సీఎస్సీ నోడల్ ఆఫీసర్ పాండురంగయ్య (7989690495), ఫసల్ బీమా కంపెనీ ప్రతినిధి సిద్దేశ్వర్ (8431377472), వంశీకృష్ణ–టెక్నికల్ ఏఓ (8331057724)లను రైతులు సంప్రదించినా ప్రీమియం కట్టడానికి వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది.


