జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
అనకాపల్లి టౌన్: ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదవాలని, ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడానికే షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్ధానికంగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్, పదో తరగతి 2026 సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరిట ప్రతిభా అవార్డులు, ప్రోత్సాహక నగదు బహూకరణ ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. జిల్లాలోని ఇంటర్లో 34 మందికి, పదో తరగతిలో 154 మంది మెత్తం 188 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, ఒక్కో విద్యార్థికి 20 వేల రూపాయల నగదు, ప్రశంసాపత్రం ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్, ఆర్డీవో అయేషా, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, డీఈవో అప్పారావు నాయుడు, డీఐఈవో వినోద్ బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


