మైనింగ్ మాఫియాపై
● నేడు ‘చలో పంచదార్ల’ ఉద్యమం
● ఉదయం 9 గంటలకు అనకాపల్లి రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ : ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్
● హాజరుకానున్న బొత్స, కురసాల కన్నబాబు, అమర్నాథ్, ముత్యాలనాయుడు తదితరులు
సాక్షి, అనకాపల్లి: కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ అరాచకంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా, పురాతన దివ్యక్షేత్రంగా భావించే శ్రీ ఉమా ధర్మలింగేశ్వరస్వామి వారి ఆలయం వెలసిన పంచదార్ల కొండను స్థానిక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పీఏ విజయ్కుమార్ నాయుడు పేరుతో, లక్ష్మీ మినరల్స్ పేరుతో స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ అనుచరుడు వై.శ్రీనివాస్ పేరుతో తవ్వేస్తున్నారు. ఏడాదికి రూ.100 కోట్ల అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. చోళుల కాలంనాటి, మహాభారతంలో పాండవుల నివాసం ఉన్న చరిత్ర ఉన్న యలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ను వ్యతిరేకిస్తూ మంగళవారం ‘చలో పంచదార్ల’ పేరిట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.
యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమబాటలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజరాణి, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంబా రవిబాబు, ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరాజు, రేగం మత్స్యలింగం పాల్గొననున్నారు. వీరితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నేతలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
కూటమి నేతల మైనింగ్ అక్రమాలపై వైఎస్సార్సీపీ ధర్మ పోరాటం


