తెలంగాణ ప్రభుత్వానికి 20 కోట్ల విరాళం! | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వానికి 20 కోట్ల విరాళం!

Published Wed, May 28 2014 1:17 AM

Telangana government    Donation of 20 million!

ఒక రోజు మూల వేతనం ఇచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం
22 సంఘాలతో జేఏసీ ఆవిర్భావం

 
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఒకరోజు మూలవేతనం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. కొత్త ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో 22 ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ టీచర్స్ జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. 1.50 లక్షల మంది ఉపాధ్యాయుల మూలవేతనంతో దాదాపు రూ.20 కోట్లకు పైగా అయ్యే ఆ మొత్తాన్ని జూన్ 2న కొత్త ప్రభుత ్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేయనున్నట్లు వివరించింది. ఎమ్మెల్సీ పూల రవీందర్ ఆధ్వర్యంలో జేఏసీని ఏర్పాటు చేశారు. 

టీచర్స్ జేఏసీ చైర్మన్‌గా పి.వెంకట్‌రెడ్డి, సెక్రటరీ జనరల్స్‌గా భుజంగరావు, మణిపాల్‌రెడ్డి, కన్వీనర్‌గా సాయిరెడ్డి, కో-చైర్మన్లుగా యాదయ్య, అబ్దుల్లా, లక్ష్మారెడ్డి, ధమనేశ్వర్‌రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా మల్లయ్య, దేశ్‌పాండే, నారాయణరెడ్డి, బాలపీరు, మల్లికార్జున్‌రెడ్డి, కోశాధికారిగా వాసుదేవరావులను ఎన్నుకున్నారు. తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంటు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారని, అది ఇవ్వకపోయినా సంతోషమేనని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉపాధ్యాయ సమస్యల జోలికి వెళ్లకుండా, విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారిస్తామన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 10వేల మంది స్థానికేతరులు ఉన్నారని, ఆ లెక్కలు తీసి వారి ప్రాంతాలకు పంపించాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
Advertisement