breaking news
-
వివాహేతర సంబంధం.. అత్తపై కోడలు దాడి
కోనేరుసెంటర్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను ప్రియుడితో కలిసి కోడలు హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు నిలబెట్టుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్ లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్ నగరంలోని ఓ పెట్రోల్బంకులో పనిచేస్తుంటాడు. సురేష్ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. మూడేళ్ల బాబుతో పరారీ.. అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకోగా చనిపోయిందనుకుని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గుర్తుతెలియని వ్యక్తితో పాటు లిఖిత కోసం గాలిస్తున్నట్లు సీఐ ఎస్కే నబీ తెలిపారు. -
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్య
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కుటుంబ కలహాలతో ఓ తల్లి కన్నకొడుకుతో మృత్యుఒడిలోకి చేరింది. ఈ ఘటన ఆదివారం చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు... తుమ్మింద గ్రామానికి చెందిన బాబు భార్య కవిత్ర (26)కు అయిదేళ్ల కిందట వివాహం అయింది. ఈ దంపతులకు ముకేష్ (04) అనే కుమారుడు జన్మించాడు. శనివారం ఈ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత్ర సాయంత్రం గ్రామ సమీపంలోని బావిలో కుమారుడుతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య, కుమారుడు ఇంట్లో కనిపించకపోవడంతో భర్త, కుటుంబీకులు ఊరంతా గాలించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఊరికి సమీపంలోని బావిలో శవమై తేలారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ తదితులున్నారు. -
న్యాయవాదికి 'సైబర్' వల.. రూ.72 లక్షలు మాయం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది సైబరాసురుల వలలో చిక్కి, డబ్బులు పోగొట్టుకున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణానికి చెందిన న్యాయవాదికి 3 నెలల కిందట గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను గుజరాత్కు చెందిన పోలీసు అధికారినని, మీ ఆధార్ నంబర్కు ఓ ఫోన్ నంబర్ లింక్ అయి ఉందని, ఆ నంబర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నందుకు క్రిమినల్ కేసు నమోదైందని న్యాయవాదిని బెదిరించాడు. సుప్రీంకోర్టు నుంచి మీపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని, అందుకు మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందన్నాడు. దీంతో న్యాయవాది సమస్యను పరిష్కరించాలని కోరగా.. తొలుత రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలని నేరగాడు నమ్మబలికాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసి వివిధ లావాదేవీల ద్వారా మొత్తంగా రూ.72,68,039 బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయం బయటకు రాకూడదని, ఎవరికైనా చెబితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించాడు. తర్వాత ఇదంతా మోసమని గ్రహించిన న్యాయవాది పట్టణ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మోసపోయిన న్యాయవాది వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. -
రెండు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఆత్మకూరు/అచ్యుతాపురం రూరల్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి మోటారు సైకిల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. వీరి కుమార్తె ఆత్మకూరులోని ఏపీ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పేరెంట్ మీట్ ఉండడంతో వీరు వెళ్లారు. ఇంటివద్ద నుంచి భోజనం తీసుకెళ్లి కుమార్తెకు తినిపించారు. అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వెళుతుండగా.. నెల్లూరు–ముంబై రహదారిలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతున్న ఇన్నోవా కారు రాంగ్రూట్లో వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మంచులో దారి సరిగా కనిపించక.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో శనివారం రాత్రి మోటారు సైకిల్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో మునగపాక మండలం గణపర్తి గ్రామానికి చెందన ధనువిజయ్ (19), చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూలి దుర్గ (20) మరణించారు. ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపిన మేరకు.. తండ్రి చనిపోవడంతో దూలి దుర్గ అచ్యుతాపురం మండలం చోడపల్లిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. గణపర్తికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనువిజయ్ లైటింగ్ పనులకు సహాయకుడిగా వెళుతున్నాడు. వీరికి జగన్నాథపురానికి చెందిన ఇంటి జగన్ స్నేహితుడు. గణపర్తిలో శనివారం జరిగిన పండుగలో వీరు ఉత్సాహంగా గడిపారు. తరువాత దుర్గను చోడపల్లిలో డ్రాప్ చేయడానికి బైక్పై ముగ్గురూ బయలుదేరారు. జగన్నాథపురంలో జగన్ దిగిపోయి, తన బైక్ను దుర్గకు ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో దుర్గ, ధనవిజయ చోడపల్లి వెళుతుండగా మంచు విపరీతంగా కురవడంతో దారి సరిగా కనిపించక జగన్నాథపురం సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. -
అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్సై రాజేష్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
గుంటూరులో మళ్లీ డ్రగ్స్ కలకలం
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు తల్లీకుమార్తె మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె డ్రగ్స్కు బానిసగా మారిందని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్లోని ఒక టీవీ చానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటున్న పెద్ద కుమార్తె (17) ఇక్కడే ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇద్దరు యువకులు తన కుమార్తెను డ్రగ్స్కు బానిసగా మార్చారని తల్లి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ అలవాటు మానుకోవాలని తల్లి చెప్పగా.. శుక్రవారం తల్లీకుమార్తె మధ్య ఘర్షణ తలెత్తగా కుమార్తె తల్లికి ఎదురుతిరిగింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఫిట్స్ తగ్గడానికి ఉపయోగించే టాబ్లెట్లను అధికంగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితురాల్ని కలిసిన పోలీసు అధికారులు మహిళ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మైనర్ విద్యారి్థనిని మాదక ద్రవ్యాల ఉచ్చులోకి లాగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పూర్తిస్థాయిలో డ్రగ్స్కు బానిసైన బాలికకు ఆడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రేమ పేరుతో యువతిని వంచించి మాదకద్రవ్యాల మత్తుకు అలవాటు చేసిన వారిని పట్టుకు తీరుతామన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. కుమార్తె తన మాట వినడం లేదని, బాలికను వారించే క్రమంలో తల్లిపై తిరగబడిందని చెప్పారు. దీంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆ బాలికకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారిస్తామన్నారు. కొన్ని కళాశాలల్లోని విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన ఇద్దరు యువకులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎన్టీఆర్ జిల్లా: బోర్డు తిప్పేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అడ్వైజరీ సర్వీసెస్’ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేసిన నిర్వాహకులు.. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. పది వేలు పెడితే ప్రతీ నెలా వెయ్యి రూపాయలు, రూ. ఐదు లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు రూ.25 కోట్లకు పైగానే వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. -
టీడీపీ నేతల అరాచకం.. నెల్లూరులో కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్సీపీ కార్పొరేటర్గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు. చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్నకు గురయ్యారని సీఐ హుస్సేన్బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. -
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దుర్గమ్మ.. చినవెంకన్న.. శివయ్య.. దత్తాత్రేయుడు.. సూర్యనారాయణుడు.. సింహాద్రి అప్పన్న.. అందరి దర్శనం చేసుకున్నారు. భద్రాచలం సీతారాముల్ని దర్శించుకునేందుకు బయల్దేరారు. అంతలోనే పొగమంచు పగబట్టింది. రోడ్డు మలుపు మృత్యువుగా మారి 9 మందిని పొట్టనపెట్టుకుంది. తీర్థయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంటున్న సమయంలో మృత్యులోకానికి చేరుకున్నారు. నిన్నటివరకూ తమతో ప్రయాణించిన వారు.. ఇప్పుడు విగతజీవులుగా మారిపోయారని తెలిసి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరులో మొదలైన ప్రయాణం.. చింతూరు సమీపంలో శాశ్వతంగా ఆగిపోయింది. తులసిపాక ఘాట్ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 9 మంది మృతి చెందగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారికి చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సాయంత్రం మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన నలుగురు క్షతగాత్రులను అంబులెన్సులలో చిత్తూరు పంపించారు. మిగతా క్షతగాత్రులను మినీ బస్సుల్లో వారి స్వగ్రామాలకు పంపించారు.రాజుగారి మెట్ట వద్ద..అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తులసిపాకలోని రాజుగారి మెట్ట వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. మొత్తం 37 మంది ప్రయాణిస్తున్న బస్సులో 32 మంది తీర్థయాత్రలకు వచ్చిన వారు కాగా.. ఒకరు ఆర్గనైజర్, ఇద్దరు వంట మనుషులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు కలిపి మొత్తం 37 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్ చేస్తున్న మొదటి డ్రైవర్కు గాయాలు కాగా.. పక్కనే ఉన్న మరో డ్రైవర్కు చేయి విరిగింది. వీరిలో 9 మంది మృతి చెందారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ఆరుగురు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మృతులంతా చిత్తూరు జిల్లా వారే. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్లు, 5 పోలీసు వాహనాలతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 22 మందికి చింతూరు ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు గాయం కావడంతో.. మొదట్లో భద్రాచలం ఆస్పత్రికి తరలిద్దామనుకున్నారు. అయితే, ఇబ్బందేమీ లేదని తేలడంతో చింతూరు ఆస్పత్రిలోనే చికిత్స అందించారు.పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చి..చిత్తూరు నగర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 32 మంది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టూర్ వేసుకునున్నారు. వీరిలో 20 మంది మహిళలున్నారు. ఈ నెల 6న మిట్టూరులోని విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన ఏపీ 39 యూఎం 6543 నంబర్ బస్సులో బయలుదేరారు. మురకం బట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా బస్ బుక్ చేసుకున్నారు. తొలుత కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకాతిరుమల, భీమవరం, పాలకొల్లు, అంతర్వేది, ద్రాక్షారామం, పెనుగొండ, సామర్లకోట, పిఠాపురం, కోటిపల్లి, అన్నవరం, అరసవల్లి, శ్రీకూర్మం చూసుకొని గురువారం విశాఖ చేరుకున్నారు. ఇక్కడ సింహాచలం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా అరకు లోయకు వెళ్లారు. అక్కడ నుంచి గురువారం సాయంత్రం 5 గంటలకు అరకు నుంచి భద్రాచలం వెళుతున్న క్రమంలో దుర్ఘటన జరిగింది. కాగా, హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్బర్దర్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఘటనాస్థలాన్ని, స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున రూ 2 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు మంత్రి రాంప్రసాద్రెడ్డి ప్రకటించారు. తీవ్రగాయాలైన వారికి రూ.2 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మృతుల వివరాలుమృతుల్లో చిత్తూరు నగరానికి చెందిన నాగేశ్వరరావు(68), శ్రీకళాదేవి (64), కావేరి కృష్ణ(70), శ్యామల(67), తవణంపల్లె మండలానికి చెందిన దొరబాబు(37), పలమనేరుకు చెందిన దంపతులు శివశంకరరెడ్డి(47), సునంద (45), పెనుమూరుకు చెందిన కృష్ణకుమారి(47), తెనాలి శైలజారాణి(64) ఉన్నారు.అతివేగం.. పొగమంచే కారణంబస్సులో ప్రసాద్, మధు అనే ఇద్దరు డ్రైవర్లుండగా.. మధు బస్సు నడుపుతున్నట్టు క్షతగాత్రులు చెప్పారు. మలుపుల వద్ద కూడా వేగంగా వెళ్తుండగా.. నెమ్మదిగా వెళ్లాలని చెప్పినట్టు బాధితులు తెలిపారు. చాలామంది గాఢ నిద్రలో ఉండగా.. దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రోడ్డు కనిపించకపోయినా.. వేగంగా మలుపు తిప్పడంతో తులసిపాక వద్ద మరో మలుపు ఉన్నట్టు డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో బస్సు వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రయాణికులు నిద్ర నుంచి తేరుకునేలోపే 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల హాహాకారాలతో ఘాట్రోడ్డు విషాదకరంగా మారిపోయింది. కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికులు మాత్రం చిన్న గాయాలతో బయటపడగలిగారు. నడిచేందుకు వీలుగా ఉన్న దారికి అటుఇటుగా ఉన్న సీట్లల్లో కూర్చున్న ప్రయాణికులు మాత్రం వెంటనే కిందపడిపోయారు. బస్సు ఏటవాలుగా బోల్తాపడటంతో ఒక్కసారిగా నిద్ర మత్తులోనే కిందపడి జారుకుంటూ వెనక్కి వెళ్లి గుద్దుకోవడంతో కనీసం ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి భద్రాచలానికి ఇంకో 2 గంటల్లోగా చేరుకుంటారనేలోగా ఘోర ప్రమాదం జరిగింది.తీరిగ్గా.. తాపీగా..ఈ ఘాట్రోడ్డులో ప్రయాణం భయంగానే ఉంటుంది. చురుకైన మలుపులతో పాటు రోడ్డు మధ్య గుంతలతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పాడైపోయిన ఈ రోడ్లను బాగు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని స్థానికులు పదేపదే కోరుతున్నా కనీసం గుంతలు కూడా పూడ్చిన పాపాన పోలేదు. గతంలోనూ ఈ ఘాట్రోడ్డులో పలు ప్రమాదాలు జరిగాయి. 15 అక్టోబర్ 2019లో కర్ణాటకకు చెందిన ప్రయాణికులు ఇక్కడి రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మారేడుమిల్లి ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు సీజను కూడా. వచ్చే మార్చి నెలాఖరు వరకూ ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయానికి ముందే రోడ్లను బాగు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. గత సంక్రాంతి సీజన్కే గుంతలు లేని రోడ్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది దాటి మరో సంక్రాంతి వస్తున్నప్పటికీ రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజా ప్రమాదంతో తీరిగ్గా స్పందించిన ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ భారీ వాహనాలకు ఘాట్ రోడ్డులో అనుమతి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిఅల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు విచారంబస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదం గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతిచెందగా, గాయపడిన వారిని చింతూరు ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. మృతుల్లో 8 మంది చిత్తూరు జిల్లా వాసులేచిత్తూరు అర్బన్: మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడిన దుర్ఘటన పదుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. దుర్మరణం పాలైన వారిలో 8 మంది చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా.. తిరుపతి జిల్లాకు చెందిన మరో మహిళ ఉన్నారు. మరో 24 గంటలు దాటితే ఎవరి ఇళ్లకు వారు చేరుకునేవారు. మృతుల్లో ఒకరైన శ్రీకళాదేవి విశ్రాంత ప్రధానోపాధ్యాయిని. ఆరేళ్ల క్రితం భర్త చనిపోగా.. కొడుకు బసవంత్రెడ్డి యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇతను వస్తే తప్ప శ్రీకళాదేవి మృతదేహాన్ని చిత్తూరుకు తీసుకొచ్చేవాళ్లు లేరు. మరో మృతుడు నాగేశ్వరరావు చిత్తూరు న్యూట్రిన్ సంస్థలో పనిచేసి రిటైరయ్యారు. భార్య అమ్ములు, బాయ్తో కలిసి ఉంటున్నారు. పిల్లలు లేకపోయినా ఈ దంపతులు అన్యోన్యంగా ఉంటూ నాగేశ్వరరావుకు వచ్చే పింఛన్ డబ్బుతో కాలం గడుపుతున్నారు. చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన శ్యామల విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త చనిపోవడంతో హైదరాబాద్లో కుమార్తె వద్ద ఉంటున్నారు. చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన కావేరి కృష్ణ సైతం ప్రమాదంలో మృతి చెందారు. ఇతడి కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. తవణంపల్లెకు చెందిన దొరబాబు దాదాపు 20 ఏళ్లుగా వంట పనిచేస్తున్నాడు. పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పూరిగుడిసెలో కాపురముంటున్న ఈ కుటుంబానికి రెక్కాడితేగానీ డొక్కాడదు. మృతుడి భార్య సుమలత సున్నిత మనసు్కరాలు కావడంతో ఆమె భర్త చనిపోయిన విషయం ఇప్పటివరకు చెప్పలేదు. పలమనేరుకు చెందిన శివశంకర్రెడ్డి, సునంద దంపతుల ఒక్కగానొక్క కుమారుడు వెంకటసాయి బీడీఎస్ చదువుతున్నాడు. బెంగళూరు కేఆర్ పురంలో స్థిరపడ్డ మరో మహిళ కృష్ణకుమారి స్వగ్రామం పెనుమూరు మండలం బలిజపల్లె. ఈమె భర్త హరినాథరెడ్డి హిటాచీలతో వివిధ పనులు చేయిస్తుంటారు. భార్య మరణవార్త విన్నాక కన్నీటి పర్యంతమైన హరినాథరెడ్డి హుటాహుటిన చింతూరు బయలుదేరాడు. తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకి చెందిన విశ్రాంత అధికారిణి తెనాలి శైలజారాణి ఐదేళ్ల క్రితం గ్రంథాలయ అధికారిణిగా రిటైరయ్యారు. అప్పటి నుంచి టెలిఫోన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. తరచూ ఆధ్మాత్మిక యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తూ వచ్చేది. వీరంతా ఈ నెల 6న రాత్రి 9 గంటలకు చిత్తూరు నుంచి ట్రావెల్ బస్సులో బయలుదేరారు. వీరంతా 13వ తేదీన మహానంది, అహోబిలం, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం, తాళ్లపాక అన్నమయ్య ప్రాంగణం చూసుకుని చిత్తూరు చేరుకోవాల్సి ఉంది. ఇంతలో రోడ్డు ప్రమాదం జరగడంతో విహార యాత్ర విషాదంగా ముగిసింది. టూర్లో అరకు లేకపోయినా..ఈ యాత్రలో అరకు వెళ్లాలని ఎవరూ అనుకోలేదు. గురువారం ఉన్నట్టుండి అరకు వెళ్లాలని పలువురు పట్టుబట్టారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.500 అదనంగా వసూలు చేసి అరకు వెళ్లడం, అటు నుంచి భద్రాచలం వస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రయాణికురాలు పద్మజ తెలిపారు.బస్సు ఒకరిది.. ఆపరేటర్ మరొకరుచిత్తూరు రూరల్ (కాణిపాకం): చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద లోయలో పడిన బస్సు చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తికి చెందినది. ఇతడు 30 ఏళ్లుగా బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఇతనికి ప్రస్తుతం రెండు బస్సులున్నాయి. అందులో ఏపీ 39యూఎం 6543అనే బస్సు అదుపు తప్పింది. ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ బస్సును రెండేళ్ల క్రితం విఘ్నేశ్వర ట్రావెల్స్ సంస్థ రామ్మూర్తి నుంచి అద్దెకు తీసుకుని టూర్స్ నిర్వహిస్తోంది. పన్నీర్ సెల్వం అనే వ్యక్తి విఘ్నేశ్వర ట్రావెల్స్ను నడిపిస్తున్నారు. ఇతని ద్వారా దొడ్డిపల్లికి చెందిన వజ్రమణి అనే వ్యక్తి టూరిస్టు ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఇతని ద్వారా విహార యాత్రలకు వెళ్లే వారి పూర్తి వివరాలు ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద ఉండటం లేదు. దీనిపై ట్రావెల్స్ నిర్వాహకులు దృష్టి సారించడంలేదని తెలుస్తోంది.‘ఫిట్నెస్ ఎలా ఇచ్చారో’ప్రమాదానికి గురైన బస్సు 2012లో రిజిస్ట్రేషన్ అయింది. గత నెల 6న ఫిట్నెస్ సర్టిఫికెట్(ఎఫ్సీ) చేయించారు. ఈ గడువు 2026 నవంబర్ 7 వరకు ఉంది. చిత్తూరు నగర బంగారుపాళ్యం సమీపంలోని ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్లో ఎఫ్సీ చేయించారు. అక్కడికి బండి వెళ్లకుండానే ఎఫ్సీ చేయించారా, లేకుంటే బండి లోపాలను చూడకుండా ఎఫ్సీ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బండి కండిషన్ ఆధారంగానే ఇచ్చారా అనే అనుమానాలు ఉన్నాయి.డ్రైవర్ల వివరాలు ఇలా..బస్సులో మధు, ప్రసాద్ అనే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. మధు 2014లో హెవీ లైసెన్స్ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ కాలపరిమితి 2030 వరకు ఉంది. ఇతనిపై ఇంతవరకు ఎలాంటి కేసులు, ప్రమాద సమస్యలు లేవని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రసాద్ మరో డ్రైవర్ కూడా 2006లో హెవీ లైసెన్స్ పొందాడు. ఈ లైసెన్స్ గడువు 2026 జూన్ 26తో ముగియనుంది. ఇతడి హయాంలో కూడా ప్రమాదాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు.ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథకూతురు, అల్లుడిని కోల్పోయిన వృద్ధురాలు భర్తను కోల్పోయిన రిటైర్డ్ టీచర్ దుర్ఘటనలో కదిలించే ఉదంతాలునేను పోయి వాళ్లు బతికినా బాగుండేది... ‘‘కూతురు సునందన, అల్లుడు శివశంకర్రెడ్డి, సమీప బంధువు శ్రీకళ (భర్త మేనకోడలు)తో కలిసి తీర్థయాత్రకు బయల్దేరా. ప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో జీవితం ఉన్న వారి బదులు నేను చనిపోయినా బాగుండేది. నా భర్త రామచంద్రారెడ్డి వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. – వరిగపల్లి కుమారిహెల్పర్గా తెచ్చిన వంట మనిషి ప్రాణాలు కోల్పోయాడు మాంసం దుకాణం నడిపే నన్ను వంట మనిషి దొరబాబు రోజు కూలీకి హెల్పర్గా రమ్మన్నాడు. ప్రమాదంలో దొరబాబు మృతి చెందగా నా కాలికి గాయాలయ్యాయి. మృతదేహాలు నా మీద పడడంతో ఊపిరి ఆడలేదు. ఎలాగోలా కిటీకి నుంచి బయటకు వచ్చా – చిత్తూరుకు చెందిన సయ్యద్ ఇర్ఫాన్బ్రేక్ పడడం లేదని డ్రైవర్ చెప్పాడు... బస్సు ప్రమాదానికి ముందు నాకు మెలకువ వచి్చంది. బ్రేక్ పడడం లేదని డ్రైవర్ మధు చెప్పాడు. ఈ లోగానే బస్సు ప్రమాదానికి గురైంది. బోల్తా పడడంతో నా చేయి విరిగింది. బస్సు కిందకు దిగి నేను రెండు మృతదేహాలను బయటకు తీశా. – రెండో డ్రైవర్ పోగల ప్రసాద్తుపానుతో ఆగాం.. ప్రమాదం బారినపడ్డాం తీర్థయాత్రలకు గత నెల 23న బయలుదేరాలని భావించాం. ఆ సమయంలో తుపాను రావడంతో ప్రయాణం వాయిదా పడింది. దీంతో ఈ నెల 6న బయల్దేరాం. దుర్ఘటనలో నా తలకు తీవ్ర గాయమైంది. – చిత్తూరుకు చెందిన పద్మజమమ్మల్ని రమ్మన్న స్నేహితులు చనిపోయారు మా వీధిలో ఉంటున్న స్నేహితులు సరదాగా ఆంధ్రా చూసి వద్దాం రమ్మంటే వారితో బయల్దేరా. ప్రమాదంలో మా తలలకు తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమంటే.. మమ్మల్ని రమ్మని చెప్పిన నాగేశ్వరరావు, శ్రీకళ మృత్యువాత పడ్డారు. – చిత్తూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు షేక్ అష్రఫ్, ముంతాజ్ మనశ్శాంతి కోసం వస్తే నా స్వామి చనిపోయాడు మేం ఇద్దరం రిటైర్డ్ టీచర్లం. కొంతకాలం క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నా. పిల్లలు లేరనే బాధలో ఉన్న మేము మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు బయల్దేరాం. ఇప్పుడు ప్రమాదంలో భర్తను కోల్పోయా. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేను. – చిత్తూరుకు చెందిన నాగేశ్వరరావు భార్య అమ్ములుబాయి – చింతూరు/మోతుగూడెం -
నలుగురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం: కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుతున్న నలుగురు ఇంటర్ విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నకి పాల్పడ్డారు .వివరాల్లోకి వెళ్తే.. వసతి గృహంలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని భావించిన హాస్టల్ వార్డెన్, ఈ విషయం గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని విద్యార్థినులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఆందోళన చెందిన ఆ నలుగురు విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల నుండి మౌఖిక వాంగ్మూలం తీసుకోవడంతో పాటు, హాస్టల్ వార్డెన్ వ్యవహారం, కళాశాల పరిపాలనలో ఉన్న లోపాలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. -
అనంతలో అయ్యప్ప మాలధారుడి దారుణ హత్య
బుక్కరాయసముద్రం: ఇద్దరు అయ్యప్ప మాలధారుల మధ్య ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. బుక్కరాయసముద్రం వీర భద్రకాలనీలో నివాసం ఉంటున్న జయమ్మ, ఆంజనేయులు కుమారుడు సాయి చరణ్(20) అదే కాలనీకి చెందిన ధన్రాజ్, తాడిపత్రి మండలం బుగ్గకు చెందిన సంతోష్ స్నేహితులు. చరణ్ మేజర్ కాగా, ధనరాజ్, సంతోష్ మైనర్లు. వీరంతా అనంతపురంలోని కూరగాయల మార్కెట్లో రోజువారీ కూలి పనులకు వెళ్తున్నారు. ఇటీవల ముగ్గురూ అయ్యప్ప మాలధారణ చేశారు. ఈ క్రమంలో ఈనెల 6వ తేదీన సంతోష్, ధనరాజ్, చరణ్ ద్విచక్రవాహనంలో రెడ్డిపల్లి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు స్నానానికి వెళ్లారు. ఆ సమయంలో సాయి చరణ్, సంతోష్ మధ్య వివాదం రేగింది. మాటామాటా పెరిగి ఇద్దరూ ఘర్షణకు దిగారు. దీంతో ధన్రాజ్ ఇరువురినీ విడిపించి సర్ది చెప్పాడు. అనంతరం సాయి చరణ్ మరోసారి బావిలోకి దిగగా, సంతోష్ చరణ్పై బండరాళ్లు వేశాడు. తీవ్రంగా గాయపడిన సాయిచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సంతోష్ బెదిరించడంతో ధనరాజ్ భయపడిపోయాడు. అనంతరం ఇరువురు ఇళ్లకు వెళ్లిపోయారు. మూడు రోజులైనా కుమారుడి ఆచూకీ కనిపించకపోవడంతో సాయిచరణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కళ్లముందే స్నేహితుడు చనిపోవడంతో తీవ్రంగా మధనపడిన ధనరాజ్ రెండురోజుల తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సాయి చరణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని వెంటబెట్టుకుని మంగళవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సాయి చరణ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ కుమారి మృతి
కడప జిల్లా: మండలంలోని మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జి.కుమారి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో కుమారి విధులు ముగించుకున్నారు. పులివెందుల వచ్చేందుకు తొండూరు సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉండగా, బూచుపల్లెకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కనిపించాడు. ఆమె చేయి ఎత్తడంతో తన ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమెను ఎక్కించుకుని పులివెందులకు బయలుదేరాడు. మడూరు గ్రామ సమీపంలోకి రాగానే నాలుగు లేన్ల రోడ్డు పనులలో భాగంగా బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు, రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఘన మద్దిలేటి, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. మృతురాలు కుమారికి భర్త విశ్వనాథ్(చిన్నా)తోపాటు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు. కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీఓ రామచంద్రుడు, రెవెన్యూ సిబ్బంది కోరారు. -
రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
సాక్షి, తిరుపతి: నగరి తడుకు పేట వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు, మరో తమిళనాడు వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు తమిళనాడు వాసులకు తీవ్రమైన గాయాలు జరిగినట్టు సమాచారం. నగరి తడుకు పేట వద్ద అతివేగంగా కారు నడపడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పద్మావతి అమ్మవారి ఆలయం పోటు కార్మికులు శంకర, సంతానంగా గుర్తింపు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. -
బాత్రూమ్ కడితేనే సంసారానికి వస్తా!
కర్నూలు జిల్లా: బాత్రూమ్ సమస్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు. బాత్రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు. -
పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం
తిరుపతి: నగరంలో మైనర్ పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్వీ పాలిటెక్నిక్ చదువుతున్న బాధిత విద్యార్థిని ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె మరో హాస్టల్కు మారుతున్న సమయంలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే వారి పరిచయం పెరగడంతో విద్యార్థిని ర్యాపిడో డ్రైవర్ను ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకుని, నమ్మించి తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు విద్యార్థిని తెలిపింది.దీంతో ఆమె తన స్నేహితురాలితో కలిసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందుతుల ఆచూకీకై గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితుడు సాయికుమార్ పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగుతున్నట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. -
కులం కాటుకు ఎంటెక్ విద్యార్థిని బలి
ఒంగోలు టౌన్: కులం కాటుకు మరో యువతి బలైంది. ప్రేమిస్తున్నప్పుడు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి అడ్డయింది. దాంతో ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలి సూసైడ్ నోట్ ప్రకారం వివరాలివీ.. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంకు చెందిన మైరాల నళిని, మహేంద్ర నగర్కు చెందిన సింగోలు శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. నీవు లేకపోతే బతకలేనని చెప్పిన శ్రీనివాస్ నళినిని అన్ని విధాలా వాడుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. నీ కులం వేరు నా కులం వేరు.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడంలేదంటూ ఫోన్ కట్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో శ్రీనివాస్తో మాట్లాడదామని శనివారం అతడి ఇంటికి వెళ్లింది. ‘శ్రీనివాస్ మాలలో ఉన్నాడు.. ఇంట్లోకి రావద్ద’ని అతని తల్లిదండ్రులు నళినిని బయట నుంచే పంపించేయడంతో ఇక శ్రీనివాస్తో తన పెళ్లి జరగదని ఆందోళనకు గురైన నళిని ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని మరణించింది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్ చూపరులను కలచివేస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన నళిని ఎంటెక్ చదివింది. తండ్రి దేవదానానికి నలుగురు ఆడపిల్లలు ఉండగా వారిలో ముగ్గురికి వివాహమైంది. నళిని మూడో సంతానం. వన్ టౌన్ సీఐ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. దళిత హక్కుల సంఘం నాయకులు నీలం నాగేంద్రం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. నళిని మృతికి కారణమైన శ్రీనివాస్ మీద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు. ⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు. -
పెళ్లైన నెల రోజులకే నవ వరుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా: ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాల్సిన యువకుడికి ఏం కష్టమొచ్చిందో ఏమో పెళ్లైన 33 రోజులకే జీవితంపై విరక్తి చెంది శెనగ పంటకు వాడే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామానికి చెందిన జయరాం నాయుడుకు శరత్ కుమార్ నాయుడు(23), లోకేష్ కుమార్ నాయుడు అనే ఇద్దరు కుమారులు. శరత్ కుమార్ నాయుడు మరో వ్యక్తితో కలిసి కొంత కాలంగా బెంగళూరులో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు లోకేష్ కుమార్ నాయుడు నగరూరులో తమ వ్యవసాయ తోటల్లో తండ్రికి చోదోడు వాదోడుగా ఉంటున్నాడు. గత నెల 2, 3వ తేదీల్లో బళ్లారి జిల్లాలోని సుగ్గేనహళ్లి కొట్టాల గ్రామానికి చెందిన సుస్మితతో శరత్ కుమార్ నాయుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. 10 రోజుల క్రితం తన భార్య సుస్మితను నగరూరు గ్రామంలో తమ ఇంటి వద్ద ఉంచి శరత్కుమార్ బెంగళూరు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీన సుస్మిత తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఏం కష్టం వచ్చిందో కానీ.. శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చిన శరత్కుమార్ తాడిపత్రి మీదుగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న తన స్నేహితుడు హరీష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీకి హరీష్ వెళ్లిన తర్వాత ఇంటిలో ఉన్న శరత్ కుమార్ నాయుడు తన సెల్ఫోన్లో భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. 9 గంటల తర్వాత తాను శెనగ గింజలకు వేసే క్రిమిసంహారక మాత్రలు మింగానని శరత్కుమార్ హరీష్కు ఫోన్ చేశాడు. వెంటనే గదికి వచ్చిన హరీష్ విలవిలలాడుతున్న శరత్కుమార్ నాయుడును ఓ వాహనంలో తాడిపత్రికి తరలించాడు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. శరత్కుమార్ నాయుడిని పరీక్షించిన డాక్టర్లు ఇక లేడని తెలిపారు. అనంతపురానికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన శరత్కుమార్ నాయుడిని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మృతుడి భార్య సుస్మిత తన తల్లిదండ్రులతో అనంతపురానికి వచ్చి ఆసుపత్రిలో విగత జీవిగా ఉన్న భర్తను చూసి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
చంద్రబాబు ప్రభుత్వంలో.. రెచ్చిపోతున్న మృగాళ్లు
ధర్మవరం పట్టణంలో వరుసకు మేనమామ కావాల్సిన ఓ వ్యక్తి బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ గర్భం దాల్చడంతో అసలు విషయం బయట పడింది. తల్లి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సాకే నరసింహ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం వెలుగు చూసింది.పుట్టపర్తి మండలం బత్తలపల్లి గ్రామంలో వరుసకు పెద్దనాన్న అయిన 60 ఏళ్ల వృద్ధుడు మద్యం మత్తులో 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి యతి్నంచాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. ఈ ఘటన మూడు నెలల క్రితం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వంలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒంటరిగా ప్రయాణించాలన్నా భయపడాల్సిన దుస్థితి నెలకొంది. ఇంట్లో ఉండాలన్నా .. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లినా తిరిగి వచ్చే వరకూ ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉండటంతో అల్లరిమూకలు రాజ్యమేలుతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితుల్లో 70 శాతం మంది మద్యం మత్తులోనే లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. 120కి పైగా పోక్సో కేసులు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త మద్యం పాలసీ తీసుకురావడంతో వీధి వీధిగా బెల్టు షాపులు వెలిశాయి. రాత్రింబవళ్లూ మద్యం అందుబాటులో ఉంటోంది. ఫూటుగా సేవించిన తర్వాత మత్తులో సైకోలుగా మారి బాలికలు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారులు నుంచి పండు ముసలి వరకూ బాధితులుగా ఉన్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఏడాదిన్నర వ్యవధిలో సత్యసాయి జిల్లాలో అత్యాచార ఘటనలు దాదాపు 200 పైగా జరిగాయి. అలాగే 120 పైగా పోక్సో కేసులు నమోదు కావడంతో మహిళల రక్షణ ప్రశ్నార్థంగా మారింది. ఇక.. బయటికి రాని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు కూడా ఉన్నారు. పోలీసుల నిర్లక్ష్యం.. బాలికలు, అమ్మాయిలు, మహిళలకు అల్లరి మూకల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. బయట ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగిక వేధింపులకు దిగడం.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ‘ఏం జరగలేదు కదా’ అని కేసు తీసుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కేసులు నమోదు చేస్తే ‘మీకే నష్టం’ అంటూ బాధితులతో చెబుతుండటంతో వారికేం చేయాలో కూడా పాలుపోవడం లేదు. దీనికి తోడు నిందితులు సైతం బెదిరింపులకు దిగుతుండటంతో నమోదు కాని కేసుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. వీడియోల పేరుతో బెదిరింపులు మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడిన తర్వాత పదే పదే బెదిరిస్తూ.. సదరు మహిళలపై సామూహికంగా వచ్చి వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వీడియోలు ఉన్నాయంటూ బెదిరిస్తూ గ్యాంగ్ రేప్లకు పాల్పడుతుండటం సంచలనం రేపుతోంది. గంజాయి మత్తులో రోడ్డు పక్కన ఇంట్లోకి చొరబడి గ్యాంగ్రేప్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. రాప్తాడు, హిందూపురం నియోజకవర్గాల్లోనే ఇలాంటి ఘటనలు అధికంగా వెలుగు చూస్తుండటం గమనార్హం.మహిళలకు రక్షణ కరువైంది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ కరువైంది. హోంమంత్రిగా ఓ మహిళ ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. జిల్లాలో కూడా ఓ మహిళా మంత్రి ఉన్నారు. ఆమె దగ్గర పని చేస్తున్న అనుచరులు సైతం వేధింపులకు గురి చేస్తుండటం సిగ్గుచేటు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు -
విద్యార్థినికి అధ్యాపకుడి లైంగిక వేధింపులు
తిరుపతి సిటీ: విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మొబైల్లో రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు విద్యార్థినికి వర్సిటీ అధికారులు టీసీ ఇచ్చేసి డాక్టర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేశారు. వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తోన్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్పై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై వర్సిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
భార్య, బిడ్డను కడతేర్చిన భర్త
నరసరావుపేట రూరల్: భార్యతో పాటు ఏడు నెలల చిన్నారిని కాలువలోకి నెట్టి కడతేర్చాడు ఓ కసాయి భర్త. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారని డ్రామా ఆడి బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన కందారపు శ్రీకాంత్కు, నాదెండ్లకు చెందిన త్రివేణికి రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడు నెలల వయసుగల కుమారుడు శరత్ ఉన్నాడు. శ్రీకాంత్ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషీయన్గా పనిచేస్తున్నాడు.త్రివేణి గతంలో నర్స్గా పనిచేసేది. వివాహం అనంతరం ఇంటికే పరిమితమైంది. శరత్కు అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం వైద్యం కోసం దంపతులు నరసరావుపేట తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పరీక్షల అనంతరం త్రివేణి, శరత్ను బంధువులు ఇంట్లో వదిలి శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లాడు. రాత్రి డ్యూటీ ముగిసిన అనంతరం 9.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామం కొత్తపల్లికి బయలుదేరారు. ఏం జరిగిందో ఏమో కానీ త్రివేణి, శరత్ రావిపాడు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువలో పడిపోయారని రాత్రి 10.30గంటల సమయంలో శ్రీకాంత్ బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టగా ఇక్కుర్రు గ్రామం వద్ద త్రివేణి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్ఐ కిషోర్ ఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎదురుగా వచి్చన కారు లైటింగ్కు రోడ్డు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పిందని, నిలువరించే ప్రయత్నంలో త్రివేణి, శరత్ నీటిలో పడ్డారని శ్రీకాంత్ పోలీసులకు తెలిపాడు. త్రివేణి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించి శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా త్రివేణి మృతి విషయం తెలుసుకున్న బంధువులు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. శ్రీకాంతే భార్య, బిడ్డను కడతేర్చాడని ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట పల్నాడు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, కాలవలో గల్లంతైన శరత్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమా? శ్రీకాంత్కు తన బంధువైన మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై శ్రీకాంత్, త్రివేణి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై శుక్రవారం బంధువుల ఇంట్లో కూడా ఇద్దరూ ఘర్షణ పడినట్టు సమాచారం. కొత్తపల్లికి ద్విచ్రవాహనంపై బయలుదేరిన ఇద్దరి మధ్య కాలువ వద్ద తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే త్రివేణిపై దాడిచేయడంతో పాటు, ఏడు నెలల బిడ్డతో సహా ఆమెను కాలువలోకి నెట్టి ప్రమాదం జరిగిందని శ్రీకాంత్ డ్రామా ఆడినట్టు పోలీసులు తెలిపారు. -
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం
సాక్షి, తిరుపతి: నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిని బెదిరించి గర్భవతిని చేశాడు. బాధిత విద్యార్థిని.. వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేసింది. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు.యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. ఆ విద్యార్థినిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.లక్ష్మణ్ కుమార్పై యూనివర్శిటీ సిబ్బంది.. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్ళిపోయింది. -
గంజాయి కేసులు పెడతామని బెదిరించారు
విజయవాడ లీగల్: పోలీసులు తనను అరెస్టుచేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఏవీ పాటించకుండా అరెస్టుచేశారని కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఎ–9 నిందితుడు యర్రంశెట్టి రామాంజనేయులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ఫిర్యాదు చేశారు. హైవేల మీద ఏలూరు, భీమడోలు వంటి ప్రాంతాల్లో తిప్పారని.. ఒక హోటల్లో బంధించి, అర్ధరాత్రి 11 గంటల తర్వాత కళ్లకు గంతలు కట్టి అక్కడ నుండి మరో ప్రాంతానికి తీసుకెళ్లి తనను ఓ గదిలో బంధించి, కనీసం భోజనం, మంచినీరు కూడా ఇవ్వకుండా హింసించారని ఆయన చెప్పారు. గంజాయి కేసుతోపాటు అనేక కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తూ తప్పుడు స్టేట్మెంట్లు రికార్డు చేసుకుని బలవంతంగా కొన్ని కాగితాలపై తనతో సంతకాలు చేయించుకున్నారని రామాంజనేయులు ఆరోపించారు. అయితే, శుక్రవారం ఉ.11 గంటలకల్లా న్యాయస్థానంలో హాజరుపరచాల్సి ఉండగా, సా.3 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు ఆయన తరఫు న్యాయవాది సత్యశ్రీ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అంతకుముందు.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం రామాంజనేయులును ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. విచారణాధికారి ఏసీపీ దామోదర్ నుండి వివరణ తీసుకోవాలని న్యాయమూర్తి పి. భాస్కరరావు ఆదేశాలు జారీచేస్తూ, రామాంజనేయులును ఈనెల 15 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.బలవంతంగా తీసుకెళ్లారు: మరోవైపు.. రామాంజనేయులును గురువారం ఉ.11 గంటలకు కేసరపల్లిలోని ఆయన నివాసానికి కొందరు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని, కేసు విచారణ నిమిత్తం రావాల్సిందిగా అతనిని ఓ ప్రైవేటు వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, వచ్చిన వారి సమాచారం తమకు ఇవ్వకుండా కిడ్నాప్ తరహాలో పట్టుకెళ్లారని వారు చెప్పారు. -
లాడ్జిలో తల్లీకొడుకుల ఆత్మహత్య
సింహాచలం: అడవివరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో తల్లీకొడుకులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపిన వివరాలివి.. నగరంలోని గాజువాకకు చెందిన కుడుపూడి నీలావతి (60), ఆమె కుమారుడు కుడుపూడి గయప్పాంజన్ (40) శుక్రవారం అడవివరం వచ్చారు. వారు స్థానిక పోస్టాఫీసు వీధిలోని సిరిచందన కల్యాణమండపం అనుబంధ గదుల్లో(లాడ్జి) ఒకటి అద్దెకు తీసుకున్నారు. వారు గదిలోకి వెళ్లిన తర్వాత ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో, అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న లా అండ్ ఆర్డర్ సీఐ ఎల్.ఎస్.నాయుడు, సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. తల్లీకొడుకులు ఉరి వేసుకుని విగతజీవులుగా కనిపించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు పాతగాజువాక శ్రామికనగర్కు చెందినవారని, వారిని తల్లీకొడుకులుగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా, వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గయప్పాంజన్ టీసీఎస్లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య 2023లో నాంపల్లి స్టేషన్లో గయప్పాంజన్పై కేసు పెట్టింది.


