-
అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
యలమంచిలి రూరల్(అనకాపల్లి): రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్జెండర్గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు.వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే.. దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్షిప్ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు.అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్ పీఎస్లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు. -
AP: ఒంటరి మహిళలు, వివాహితలే టార్గెట్.. యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మహిళలను లైంగికంగా వేధిస్తున్న యూట్యూబర్ హేమాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధింపులకు గుర్తిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. తిరుపతిలో యూట్యూబర్ హేమాద్రిని తిరుచానూర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు హేమాద్రి.. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు, ఒంటరి మహిళలకు, వివాహితలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం, వారితో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు సేకరించాడు. కొద్ది రోజుల తర్వాత వారిని సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినట్టు బాధితులు.. పోలీసులు ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. హేమాద్రిని అరెస్ట్ చేశారు. మరోవైపు.. హేమాద్రి అరెస్ట్ తెలియడంతో తిరుచానూర్, తిరుపతి, చంద్రగిరి నుంచి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. -
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
ఏలూరు టౌన్: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. లొకేషన్ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ జంట ఆత్మహత్య
తిరుపతి జిల్లా: జిల్లాలోని నాయుడుపేటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నాయుడుపేటలోని అమరావతి లాడ్జి నందు ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిని ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు పాల్పడిన జంటను కుప్పరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మణి, శిరీషగా గుర్తించారు. ఈ ఘటనలో శిరీష ఉరి వేసుకుని ఉండగా, మణి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కుటుంబ సభ్యుల సమక్షంలోనే లాడ్జి గది తలుపులు పగలగొట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య
చింతపల్లి(అల్లూరి సీతారామరాజు): మండలంలో తల్లిదండ్రులు ఇంటి పనులు చేయలేదని మందలించడంతో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామారావుపాలెం జరిగింది. అన్నవరం ఎస్ఐ వీరబాబు, కు టుంబీకులు అందించిన వివరాలిలా ఉ న్నాయి. లోతుగెడ్డ పంచాయతీ పరిధిలో రామారావుపాలెం గ్రామానికి చెందిన బాలిక పాంగి దివ్య(13) వంగసార గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక అధిక సమయం చదవకుండా, ఏ పని చేయకుండా ఉండడంతో తండ్రి పాంగి బిట్టు, తల్లి కుమారి రెండురోజులు క్రితం మందలించారు. బుధవారం ఉదయం కూడా ఖాళీగా ఉండవద్దు ఇంటి పనులు, వ్యవసాయ పనుల్లో సహాయం చేయాలని మందలించి తల్లిదండ్రు లు వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక గ్రా మానికి సమీపంలో ఉన్న పంటపొలాల్లో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 10 గంటల సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు ఉరి వేసుకున్న బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు ఎస్ఐ వీరబాబు తెలిపారు. -
హ్యాండర్లతో టచ్లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేశాం!
విజయనగరం: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్ లను ఆరు రోజుల పాటు విచారించారు పోలీసులు. ఈ రోజు(బుధవారం) వైద్య పరీక్షల అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకరించాడు. దీనిలో భాగంగా పలు దేశాల హ్యాండర్లు టచ్ లో ఉన్నట్లు సిరాజ్ స్పష్టం చేశాడు.ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు పురోగతి సాధించినట్లు కనబడుతోంది.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ ఆరు రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారించారు.ఆరు రోజుల పాటు విచారణలో తొలి మూడు రోజులు నోరు విప్పని సిరాజ్, సమీర్లు.. ఆ తర్వాత కీలక విషయాలను బహిర్గతం చేయక తప్పలేదు. ప్రధానంగా పేలుళ్లకు పథకం ర.చన చేసింది సిరాజేనని సమీర్ స్నష్టం చేశాడు. అయితే దీనిపై ఈరోజు(బుధవారం) సిరాజ్ను పోలీసులు విచారించగా నిజాన్ని అంగీకరించాడు. బాంబు పేలుళ్లకు పథకం రచన చేసింది తానేనని చెప్పుకొచ్చాడు. పల ఉగ్ర కుట్ర హ్యాండర్లతో టచ్ లో ఉంటూ బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా, సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. -
ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్ అప్పులు!
పలమనేరు: కేవలం ఆధార్ కార్డుతో అప్పులిచ్చి అధిక వడ్డీలతో జనం రక్తాన్ని తాగుతున్న మైక్రోఫైనాన్స్ దాష్టీకానికి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలయ్యాడు. వాటిని కట్టేందుకు మరిన్ని అప్పులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి సమాధి సాక్షిగా చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ మాదిగబండ గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తలారి గంగప్ప కుమారుడు తలారి మోహన్ (43) ఉన్న 40 సెంట్ల స్థలంలో వ్యవసాయం, ఖాళీ సమయంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అవసరాల నిమిత్తం కొన్ని ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ కంపెనీలనుంచి రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీలతో వీటిని చెల్లించలేకపోవడం, పైగా వారినుంచి ఒత్తిళ్లు ఎదురవడంతో మంగళవారం పొలానికెళ్లి తండ్రి సమాధి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, డిగ్రీ, ఇంటర్ చదివే ఇద్దరు కొడుకులున్నారు. -
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. ఆ 20 మంది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్టు ధ్రువీకరించిన సిరాజ్, సమీర్.. ఆ 20 మంది పేర్లు తెలిసినా.. వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.గత మూడురోజులుగా నోరు విప్పని సమీర్.. సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్టు తెలిసింది. అహీం గ్రూప్నకు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితోపాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. -
కోనసీమలో విషాదం.. గోదావరిలో ఎనిమిది మంది గల్లంతు!
సాక్షి, అమలాపురం/ముమ్మిడివరం/సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు. కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. ఒకరిని కాపాడబోయి వరుసగా.. కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు.అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు వారే.. విషయం తెలుసుకున్న కె.గంగవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితంలేదు. అధికారుల బృందాలతోపాటు స్థానికులు గౌతమీ గట్టు వెంబడి గాలించారు. రాత్రి సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లా యంత్రాంగం రప్పించింది. పడవలపై ఫ్లడ్లైట్లు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు యువకులే. యువకుల కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కలెక్టర్ ఆర్. మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావు గాలింపును పర్యవేక్షించారు. గ్రామస్తుల ఆగ్రహం.. ఎనిమిది మంది యువకులు గల్లంతైనా గాలింపు చర్యలు చేపట్టడంలో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఘటన జరిగితే రాత్రి ఏడు గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్, జేసీలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సకాలంలో రాకుంటే గల్లంతైన యువకుల ఆచూకీని ఎలా తెలుసుకుంటారని నిలదీశారు.వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టండి : సీఎం చంద్రబాబు ఎనిమిది మంది యువకులు గల్లంతవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్రంలోని నీటి వనరులున్న అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. -
చంపిందేమో జూలకంటి అనుచరులు.. కేసేమో పిన్నెల్లిపై!
సాక్షి, టాస్క్ఫోర్స్: టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జంట హత్యలు జరిగాయని సాక్షాత్తూ జిల్లా ఎస్పీ ప్రకటించినా.. ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు వెల్లడించినా కూడా కూటమి సర్కార్ బరితెగించి నీచ రాజకీయాలు చేస్తోంది. కళ్లెదుటే వాస్తవాలు కనిపిస్తున్నా.. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. జూలకంటి ఫ్లెక్సీతో మొదలైన గొడవ.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య అనంతరం గ్రామ టీడీపీ నాయకత్వం జవిశెట్టి వెంకటేశ్వర్లు చేతిలోకి వెళ్లింది. ఇది టీడీపీ నాయకుడు తోట వెంకట్రామయ్య వర్గానికి ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా ఇరువర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి జన్మదినం సందర్భంగా తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీను గత నెలలో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్న వీధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన వర్గంతో కలిసి శ్రీనుపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకట్రామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి పాశవికంగా హత్య చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడైన తోట వెంకట్రామయ్యదే. ఆ కారు వెనుక జేబీఆర్ పేరుతో పసుపు రంగులో పెద్ద స్టిక్కర్ సైతం ఉంది. హత్యల అనంతరం ముందు టైర్ల సస్పెన్షన్ విరిగిపోవడంతో కారును అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. టీడీపీ నాయకుల మారణకాండ ఇది.. ఈ హత్యలు పూర్తిగా గ్రామ టీడీపీ నాయకులు చేసిన మారణకాండ అని.. దీనిని వైఎస్సార్సీపీపైకి నెట్టి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే జూలకంటి కుట్ర పన్నారంటూ మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు ఈ హత్యలతో ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి సోదరుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చడం ద్వారా అసలైన నిందితులను తప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలైన దోషులకు శిక్షలు పడకపోతే.. ప్రతీకార దాడులు కొనసాగే ప్రమాదముందని టీడీపీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు మన టీడీపీ వాళ్లదే అయితే.. వైఎస్సార్సీపీ పైకి నెట్టడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. హత్య చేసింది టీడీపీ వాళ్లేనంటూ నిర్ధారణ.. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ.. టీడీపీ నేత తోట వెంకట్రామయ్య వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడిందని మీడియాతో పాటు పోలీసులకు సాక్ష్యం చెప్పాడు. ప్రాథమిక విచారణ అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఓ వీడియో విడుదల చేశారు. హత్యకు గురైన వారు, హత్యలు చేసిన వారు.. టీడీపీకి చెందిన వాళ్లేనని స్పష్టంగా ప్రకటించారు. దీనిని నిర్ధారిస్తూ ఎస్పీ కార్యాలయం కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది. పోలీసులపై జూలకంటి ఒత్తిడి.. అనంతరం హత్య జరిగిన ప్రదేశానికి శనివారం రాత్రి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని ఆరోపించారు. కేసు నమోదులో సైతం వారి పేర్లు ఉండాల్సిందేనంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు మాట మార్చి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీని వల్ల ఎస్పీ మాటలకే విలువ లేకుండా పోయిందంటూ పోలీస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆ హత్యలతో నాకేం సంబంధం?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన జంట హత్యలకు టీడీపీలోని ఆధిపత్య పోరే కారణమని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షితో పాటు జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారని పేర్కొన్నారు. అయినా కూడా కూటమి సర్కార్ రాజకీయ కక్షతో తనపై అక్రమ కేసు నమోదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్లపాడు జంట హత్యలపై వెల్దుర్తి పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చడంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం స్పందించారు. టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావును అదే పార్టీలోని ప్రత్యర్థి వర్గం పొట్టన పెట్టుకుందన్నారు. ఈ విషయాన్ని హత్య జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మీడియాతో పాటు పోలీసులకు కూడా తెలియజేశారన్నారు. టీడీపీలోని వర్గపోరు వల్లే ఈ హత్యలు జరిగాయని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సైతం శనివారం ప్రకటించారని గుర్తు చేశారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో గొడవలు జరగ్గా. ఇరు వర్గాలు టీడీపీ వాళ్లేనని వదిలేయడంతో సమస్య పెద్దదైందన్నారు. ఆనాడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడి కారు దొరికినా.. ప్రత్యక్ష సాక్షులు సైతం హత్యలు చేసింది టీడీపీ వాళ్లేనని చెబుతున్నా.. తనపై ఎందుకు నిందలు వేస్తున్నారని పిన్నెల్లి ప్రశ్నించారు. జంట హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం మాచర్ల ప్రజలందరికీ తెలుసునన్నారు.అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి తనపై అక్రమ కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. ఈ హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ గుడిలోనైనా ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. ధైర్యం ఉంటే బ్రహ్మారెడ్డి తన పిల్లలపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల తరఫున పోరాడుతామని పిన్నెల్లి స్పష్టం చేశారు. -
భర్త, పిల్లలు వద్దు.. సురేశ్ కావాలని కాళహస్తిలో..
సాక్షి, తిరుపతి: సోషల్ మీడియా పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసి.. చివరకు ఇద్దరు ప్రాణాలను బలితీసుకుంది. భర్త, పిల్లలను విడిచిపెట్టి ప్రియుడిని వివాహం చేసుకున్న మహిళ.. చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను పెళ్లాడిన వ్యక్తి విషం తాగి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన సురేశ్, విశాఖపట్నానికి చెందిన వివాహిత పద్మతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సోషల్ మీడియా ఇన్స్స్టాగ్రామ్లో కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి సంబంధం పెరిగి చివరకు ఎంత వరకు వెళ్లిదంటే.. పద్మకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆమె మాత్రం ప్రియుడే కావాలనుకుంది. ఈ క్రమంలో భర్త, పిల్లలను విడిచిపెట్టి శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో ప్రియుడిని వివాహం చేసుకుంది. గత 9 నెలలుగా సురేశ్తో కాపురం చేస్తోంది.అయితే, వీరద్దరి మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం మరోసారి ీవీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టిఫిన్, భోజనాన్ని వృథా చేస్తోందని పద్మను సురేశ్ మందలించడంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యతో శవాన్ని కిందకు దించి సురేశ్ భయాందోళనకు లోనయ్యాడు. ఏం చేయాలో తెలియక.. అతను కూడా విషం తాగాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సురేశ్, చివరకు ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక, సోషల్ మీడియాలో మొదలైన పరిచయం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటనగా మారింది. అటు ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. -
ఉగ్ర కుట్ర కేసు.. వెలుగులోకి విస్తుపోయే కొత్త కోణాలు
సాక్షి, హైదరాబాద్: సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఏడేళ్లుగా హైదరాబాద్లో మకాం వేసిన సిరాజ్.. సమీర్ కలిసి ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్కు చెందిన ఫర్హాన్ మోయినుద్దీన్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాదర్తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా.. సిరాజ్ కౌంటర్ను మెచ్చుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి, సిరాజ్కు నాలుగు రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లు పోలీసులు నిర్థారించారు.రాజాసింగ్తో పాటు పలువురికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చిన.. ఆ గుర్తు తెలియని వ్యక్తి.. తనకు తాను విశాఖ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారానే సిరాజ్తో టచ్లో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్ను కాంటాక్ట్ చేసిన అకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. -
లారీ–కారు ఢీ: ఆరుగురు దుర్మరణం
కొమరోలు/సాక్షి, అమరావతి/బాపట్ల టౌన్: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు గ్రామం సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మహానంది పుణ్యక్షేత్రం దర్శనం అనంతరం తిరుగుముఖంలో ఈ ప్రమాదం జరిగింది. వివరాలివీ.. బాపట్ల జిల్లా స్టూవర్టుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తమ కుటుంబ సమస్యలపై చర్చించుకునేందుకు నంద్యాల జిల్లా డోన్ వెళ్లారు. అక్కడ నుంచి మహానంది వెళ్లి దైవదర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై తాటిచెర్లమోటు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులను గజ్జెల అంకాలు (40), గజ్జెల భవాని (25), గజ్జెల నరసింహులు (20), గజ్జెల జనార్ధన్ (30), బొచ్చు సన్ని (30), కర్రెద్దుల దివాకర్ (30)లుగా గుర్తించారు. గాయపడిన చిన్నారుల్లో జీతన్, శిరీష ఉన్నారు. వీరిలో జీతన్ పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల వైద్యశాలకు తరలించారు. కారు డ్రైవర్ దివాకర్ నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. ప్రమాద స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలన్నింటిని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యంత బాధాకరం: వైఎస్ జగన్ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
దారుణం.. మూడేళ్ల బాలికపై హత్యాచారం
వైఎస్సార్ జిల్లా: మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణ ఘటన జరిగింది. తల్లిదండ్రులతో పాటు వివాహానికి వెళ్లిన మూడేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రొద్దుటూరులోని అమృతనగర్కు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెతో బంధువుల పెళ్లి నిమిత్తం మైలవరం మండలం కంబాలదిన్నెకు వెళ్లారు.మూడేళ్ల బాలిక పెళ్లి మండపం బయట ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటపడుతుందని బాలికను హత్య చేశాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సమీపంలో గాలించగా.. ముళ్ల పొదల్లో బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టు
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టరయ్యింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని.. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. నెలకి రూ.15 నుంచి 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, రాజస్థానకు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ లా పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు.3 వందల డాలర్ల నుంచి 3,000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. పోలీసులు.. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రూ.3 లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని.. అపార్ట్మెంట్ ఓనర్లపై కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. -
నంద్యాల: పంటి నొప్పితో వెళ్తే.. ప్రాణం తీసిన ఆర్ఎంపీ వైద్యుడు
సాక్షి, నంద్యాల జిల్లా: పంటి నొప్పితో వెళితే ఓ వైద్యుడు ప్రాణం తీశాడు. సంజామల మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో మహిళ మృతి చెందింది. సంజామల మండలం చిన్న కొత్తపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (52) రెండు రోజులుగా పంటి నొప్పి ఉండటంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లింది. ఇంజెక్షన్ నరానికీ ఇవ్వగా ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో 108 ద్వారా కోవెలకుంట్ల ఆసుపత్రికి ఆర్ఎంపీ వైద్యుడు తరలించగా, అప్పటికే ఆ మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ వైద్యుడు పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్వార్ 7వ కాంగ్రెస్లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్గా..పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది. -
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్కుమార్ మేనకూరు సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు.. మా కళ్లెదుటే అమ్మ చనిపోయింది’ అంటూ ఆ చిన్నారి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని తన తల్లిని చంపిన వైనాన్ని పోలీసులకు వివరించిన తీరు స్థానికులను కలచివేసింది. కన్న బిడ్డల ఎదుటే అతి కిరాతకంగా భార్యను కడతేర్చిన ఘటనపై పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య వీణమ్మ(28)ను భర్త రాపూరు శ్రీనివాసులు హత్య చేసిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి తుపాకులు పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలికి అఖిల(7), బత్తెయ్య(4), ఆదెయ్య(3) చిన్నారులున్నారు. శనివారం రాత్రి భర్త శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి భార్య వీణమ్మతో గొడవపడ్డాడు. ఆపై బండరాయితో తలపై మోది చంపేశాడు. తర్వాత పాము కాటు వేయడంతో వీణమ్మ మృతి చెందిందని నమ్మబలికాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పెంచలమ్మ ఆదివారం ఉదయం బిక్కుబిక్కుమంటూ ఏడ్చుతున్న వీణమ్మ పిల్లల్ని అక్కున చేర్చుకుంది.పోలీసుల ఔదార్యం విచారణ అనంతరం వీణమ్మ మృతదేహానికి సోమవారం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుటంబ సభ్యులు నిరుపేద గిరిజనులు కావండతో వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. వీణమ్మ మృతదేహాన్ని సైతం తీసుకెళ్లందుకు వారి వద్ద నగదు లేక పోవడంతో పోలీసులే నాయుడుపేటలో వీణమ్మకు అంత్యక్రియలు జరిపించారు. పరారీలో ఉన్న ఆమె భర్త శ్రీనివాసులును త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
రాయచోటి టౌన్(అన్నమయ్య): కాళ్లు.. చేతులు కట్టేశారు.. గొంతుకు తాడుతో బిగించారు.. చనిపోయిన తరువాత ఆనవాళ్లు లభించకుండా చేసేందుకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. అయితే మృతి చెందిన మహిళ చేతి పై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్య జరిగిన వా రం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని రామసముద్రం ప్రాంతానికి చెందిన వెంకటరమణ భార్య బూసిపల్లె శివమ్మ(27) గా గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం విలేకరుల స మావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని రామసముద్రం మండలం చెంబుకూరు ఎలకపల్లె రహదారిలో ఈనెల 11వ తేదీ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగించారు. మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్కడ పెట్రోల్ కోసం వాడిన బాటిల్ మాత్రమే ఉండింది. అయితే మృతురాలి చేతిపై యస్మిత అనే పచ్చబొట్టు ఉండటంతో దాని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. పచ్చ బొట్టును సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనే విషయం తెలిసింది. అలాగే డాగ్స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి బెంగళూరు రోడ్డు వైపు వెళ్లడంతో ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించి నిందితులను గుర్తించారు. నిందితులంతా మృతురాలి బంధువులే అని తేలడంతో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బెంగళూరులో నివాసం ఉంటున్న ఎం.నీలావతి, రామసముద్రం మండలం గుండేవారిపల్లె నడింపల్లె ప్రాంతానికి చెందిన కన్నెమడుగు గణేష్, బెంగళూరులోని బి.హోసహళ్లి సజ్జాపురం ప్రాంతం అంబేద్కర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్ ఉన్నారు.ఎందుకు హత్య చేశారంటే..మృతురాలు బూసిపల్లె శివమ్మ అదే ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె బంధువులు భర్తకు తెలియకుండా ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా మృతురాలి బంధువైన నీలావతి బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్తో హత్య చేసేందుకు బేరం కుదుర్చుకుంది. వీరికి కన్నెమడుగు గణేష్ అనే వ్యక్తి సహకరించాడు. ఆ తర్వాత వారు రామసముద్రం వచ్చి శివమ్మకు మాయమాటలు చెప్పి ఆమెను తమ వెంట శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకు తాడు బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ముందుగానే తమ వెంట తెచ్చుకున్న పెట్రోలును మృతదేహంపై పోసి నిప్పంటించారు. అయితే ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రూరల్ సీఐ సత్యనారాయణ, రామసముద్రం ఎస్ఐ జి.రవికుమార్, మరికొంతమంది సిబ్బంది చాకచక్యంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారని ఎస్పీ ప్రశంసించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారుసోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలురాయచోటి టౌన్ : సమాజంలో ప్రజలను ఉద్రేకపరిచేలా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లాఎస్పీ విద్యా సాగర్నాయుడు హెచ్చరించారు. మదనపల్లెలో హనుమాన్ శోభాయాత్రలో జరిగిన సంఘటనపై సోమవారం ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. శోభాయాత్ర నిర్వాహకులు ముందుగా తమతో అనుమతులు పొందే సమయంలో ఇచ్చిన రూట్మ్యాప్ ప్రకారం కాకుండా వేరే దారిలో వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా సమస్యలు సృష్టించాలని చూశారన్నారు. ప్రకటించిన సమయానికి రాకుండా సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా రావడమే కాకుండా దారి మళ్లించి సమస్య ను సృష్టించడంతో తమ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. కావాలనే శోభాయాత్రను దారి మళ్లించి సమస్యలు సృష్టించేందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే అక్కడ ఏదో జరిగిందని ఒక వర్గాన్ని అణచివేస్తున్నట్లుగా తప్పు డు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపైన కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించుకోవాలని సూచించారు. -
మాటలకందని విషాదం
అమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు.. అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు.. అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు.. మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి తల్లిడిల్లిపోయారు.. ఏమయ్యారో అంటూ ఊరంతా గాలించారు.. చివరకు కారులో ప్రాణవాయువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.విజయనగరం క్రైమ్: సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనతో విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మాటలకందని విషాదం అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు. విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు. కడుపుకోత.. మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్లు విషాదంలో ముని గిపోయారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన ఉమ ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు.ఇళ్ల మధ్యనే ఘటన... మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్టౌన్ ఎస్ఐ రామ్గణేష్లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు.కారు ఎవరిది? బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్ట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు. -
ఐదుగురు చిన్నారులు జలసమాధి
కుప్పం రూరల్/బుట్టాయగూడెం: వేసవి సెలవుల్లో చిన్నారుల సందడితో కళకళలాడాల్సిన ఇళ్లల్లో విషాదం అలముకుంది. అప్పటివరకు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన ఐదుగురు చిన్నారులు జల సమాధి అయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఆడుకోవడానికి వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో నీటమునిగి ఓ అన్న, తమ్ముడు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ జారి పడి..చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురానికి చెందిన యశోద, వరలక్ష్మి, రాజా ఒకే తల్లి బిడ్డలు. యశోద తమిళనాడులో నివసిస్తుండగా.. వరలక్ష్మి, రాజా దేవరాజపురంలోనే ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో యశోద తన కుమారుడు అశ్విన్తో కలిసి ఇటీవల దేవరాజపురం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం యశోద కుమారుడు అశ్విన్(7), వరలక్ష్మి కుమార్తె గౌతమి(6), రాజా కుమార్తె శాలిని(7) ఆడుకుంటూ.. సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ ముగ్గురూ అందులోకి జారిపడ్డారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ రాకపోవడంతో.. తల్లిదండ్రులు వారిని వెదుకుతూ నీటి కుంట వద్దకు వెళ్లగా.. ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. వారిని అలా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయనున్నట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు.బిడ్డల కోసం తల్లి పోరాడినా..తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ అన్వర్, పర్విన్ దంపతులకు ఇద్దరు కుమారులు సిద్దిక్(10), అబ్దుల్(7). వేసవి సెలవులు కావడంతో పర్విన్ తన ఇద్దరు కుమారులను తీసుకుని జంగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆదివారం బంధువులతో కలిసి బుట్టాయగూడెం మండలం అలివేరు సమీపంలోని జల్లేరు జలాశయాన్ని చూసేందుకు వెళ్లారు. నీళ్లు తక్కువగా ఉండడంతో స్నానం చేసేందుకని జలాశయంలోకి దిగారు. సిద్దిక్, అబ్దుల్ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లడంతో.. నీట మునిగారు. వారిని కాపాడేందుకు తల్లి పర్విన్తో పాటు మరో మహిళ ప్రయత్నించారు.ఈ క్రమంలో వారిద్దరూ కూడా నీటిలో మునిగిపోతుండగా.. స్థానికులు చున్నీల సాయంతో వారిద్దరినీ బయటకు లాగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ దుర్గామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకొని పిల్లల కోసం జలాశయంలో గాలించారు. గంట సేపటి తర్వాత స్థానికుల సాయంతో వలలు వేసి.. పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలూ.. ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ రోదించారు. చిన్నారుల మృతిపై సీఎం విచారం సాక్షి, అమరావతి: విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడటంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పిల్లల మృతితో తీవ్ర శోకంలో ఉన్న తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. -
చిన్నారుల ఉసురు తీసిన కారు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ద్వారపూడి గ్రామంలో విషాదం అలముకుంది. ఆటలాడుతూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. విజయనగరం రూరల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడి గ్రామం, బీసీ కాలనీలో ఆదివారం ఒక పెళ్లివేడుక జరిగింది పెళ్లి హడావిడిలో ఉన్న తల్లిదండ్రులను విడిచి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకటో తరగతి చదువుతున్న కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), 2వ తరగతి చదువుతున్న బూర్లె జాస్రిత (8), 3వ తరగతి చదువుతున్న పండి ఉదయ్ (7) సమీపంలోని నీళ్ల ట్యాంక్ వద్ద ఆడుకోవడానికి వచ్చారు. ఆటల్లో ఆటగా అక్కడే ఆగి ఉన్న ఒక కారులోకి ఎక్కారు. అకస్మాత్తుగా డోర్ లాక్ కావడంతో లోపల చిక్కుకుపోయారు. కేకలు వేసినా బయటకు వినపడక పోవడంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సందడిలో ఉన్న తల్లిదండ్రులు, ఎంతకూ తమ పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో కారులో పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.వెంటనే కారు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్నారన్న భావనతో 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుల్లో చారులత, జాస్రిత అక్కచెల్లెళ్లు. ఇద్దరు కుమార్తెలు మృతిచెందడంతో తండ్రి ఆనంద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటనలో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్టౌన్ ఎస్ఐ రామ్గణేష్ లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.