పులివెందుల రూరల్ : కడప నగరంలోని స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో బుధవారం ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యా సాగర్ను ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు సచివాలయ సిబ్బంది సమస్యలను తెలియజేసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ రామ గంగాధరరెడ్డి యాదవ్, ఉపాధ్యక్షులు ప్రభుకుమార్, శంకరయ్య, ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి బాలల హక్కుల కమిషన్ సభ్యురాలి పర్యటన
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కేజీ పద్మలత సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి పి.రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం కడపలోని అంగన్వాడిసెంటర్, సెంట్రల్, మహిళా జైళ్లు, అడాప్షన్ ఏజెన్సీ, కడప ప్రభుత్వ ఆసుపత్రిలోని మెంటల్ హెల్త్ హాస్పిటల్, ఏకీకృత సహాయ కేంద్రం, చిన్నపిల్లల వార్డులను సందర్శిస్తారన్నారు. మధ్యాహ్నం ప్రభుత్వ బాలుర వసతి గృహం, మహిళా పోలీస్ స్టేషన్లను ఆ మె తనిఖీ చేస్తారన్నారు. శుక్రవారం ఖాజీపేట, ప్రొద్దుటూరులో పర్యటిస్తారని పేర్కొన్నారు.
గూడ్స్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప– కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్యలో బుధవారం గూడ్స్ రైలు కిందపడి సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు ధరించిన బ్లూ కలర్ ఫుల్ చొక్కాపై తెల్లని గీతలు ఉన్నాయని, తెలుపు రంగు పంచ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు రైల్వేఎస్ఐ 9247575624, 8500226717కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఉపాధ్యాయుడు సస్పెన్షన్
మైదుకూరు : వనిపెంట జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడిని బుధవారం డీఈఓ సస్పెండ్ చేశారు. పాఠశాలలో విద్యార్థినులపై ఆ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై అధికారులు విచారణ చేశారు. విచారణలో సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు తెలియడంతో ఆ మేరకు డీఈఓకు నివేదిక పంపారు. ఈ మేరకు డీఈఓ షంషుద్దీన్, సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం సస్పెండ్ ఉత్తర్వులను ఎంఈఓ–2 నరహరి శర్మ ఉపాధ్యాయుడికి అందజేశారు.


