కడప కోటిరెడ్డి సర్కిల్ : వారానికి 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కడప జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ శ్రీనివాసులరెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు దస్తగిరి, అజీజ్లు కోరారు. శుక్రవారం దేశ వ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె కడపలోని ఏడు రోడ్ల కూడలిలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక, న్యాయమైన డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ ఆసోసియేషన్, భారత ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరి, నిర్లక్ష్య ధొరణికి నిరసనగా ఈ సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. పెన్షన్ అప్డేషన్, యూనిఫాం, డీఏ, ఓపీఎస్ పునరుద్ధరణతో సహా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు. తీవ్ర పనిభారాన్ని తగ్గించడానికి అన్ని కేడర్లలో తగిన సంఖ్యలో నియామకాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మహిళా కన్వీనర్ లలితా రెడ్డి, ట్రెజరర్ మాలతి, జాయింట్ సెక్రటరీలు అనిల్, విజయ్, కిశోర్, ఏఐబీఏఓ అధ్యక్షుడు గరుడయ్య, యూనియన్ నాయకులు కిరణ్, హరి, హర్షవర్థన్రెడ్డి, రాఘవరెడ్డి, ఏపీజీబీ యూనియన్ నాయకులు కోటేశ్వరరెడ్డి, రాహుల్ పాల్గొన్నారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని అంగడి వీధిలో జూన్ 14వ తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితుడు ముసలిగాళ్ళ వంశీని శుక్రవారం అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి 57 గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. అంగడివీధికి చెందిన కొండికళ్ళు వరలక్ష్మి అనే మహిళ జూన్ 14వ తేదీ ఉదయం ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి మెయిన్ డోర్ తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువా పైన ఉన్న తాళాల సహాయంతో బీరువాను తెరిచి, అందులోని బంగారు వస్తువులు దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజుపాలెం మండలంలోని పర్లపాడుకు చెందిన వంశీని రిమ్స్ – ఉటుకూరు మెయిన్ రోడ్ లోని చైతన్య స్కూల్ సర్కిల్ సమీపంలోని టీ షాప్ వద్ద శుక్రవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రెండు బంగారు గాజులు, ఒక సాదా చైను, ఒక ఉంగరం కలిపి మొత్తం సుమారు 57 గ్రాములు బరువు గల బంగారు వస్తువులను స్వాధీన పరచుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్ కోసం కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.
విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
పులివెందుల టౌన్ : 2009 విద్యా హక్కు చట్టం నిబంధనలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పకడ్బందీగా అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పులివెందుల పట్టణంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఈ నిబంధనలు అమలు కావడంలేదన్నారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద కల్పించాల్సిన ప్రయోజనాల విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా తగిన స్పందనలేదన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, జర్నలిస్టులు కలిసి ప్రజా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.


