ఒంటిమిట్ట : ఏకశిలానగరిలోని కోదండ రామాలయంలో శనివారం పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవ మూర్తులను ఆశీనులు చేశారు. పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. ప్రధాన కుంభ ఆరాధన, చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం యాగశాలలో హోమాలు జరిపారు. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాలభోగం, పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు.టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు తులసి గజమాలలతో స్వామి, అమ్మవారిని అలంకరించారు. అనంతరం మూలవరులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. రెండవ శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.


