ఒకప్పుడు పిల్లలు అన్నం తిననని మారాం చేస్తే.. అమ్మ చంకన ఎత్తుకుని ఆకాశం వైపు చూపిస్తూ, చందమామ రావే జబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ గోరుముద్దలు తినిపించేది. తోటి పిల్లలతో కలిసి వీధుల్లో ఆడుకునే ఆటల సందడి ఉండేది. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ మురిపాలు, ఆటలు మృగ్యమైపోయాయి. పిల్లవాడు ఏడ్చినా, భోజనం చేయకపోయినా.. శాంతింపజేయడానికి తల్లిదండ్రులు చేతిలో స్మార్ట్ఫోన్ పెట్టడం అలవాటు చేసేశారు. చివరకు ఈ అలవాటు ఎంతవరకు వచ్చిందంటే.. వీధిలో ఆపి ఉంచిన స్కూటర్ ఫుట్బోర్డ్పై కూర్చుని కూడా లోకాన్ని మరిచి మొబైల్ స్క్రీన్పైనే చూపులు నిలిపేలా చేస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడి అవస్థే అందుకు నిదర్శనం. పిల్లలను మొబైల్కు బానిసలుగా మార్చేస్తుండటంతో, చిన్న వయసులోనే కంటిచూపు మందగించి కళ్లద్దాలు ఆశ్రయించాల్సి వస్తోంది. పిల్లల భవిష్యత్తును స్మార్ట్ఫోన్ల పాలు చేస్తున్న ఈ ఆధునిక సంస్కృతిపై స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. – ఖాజీపేట


