రాజంపేట : దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని అన్నమాచార్య యూనివర్సిటీ అధినేత చొప్పాగంగిరెడ్డి అన్నారు. మంగళవారం ఏయూ ఓపెన్ ఆడిటోరియంలో బీటెక్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని, ఆశలను వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా ముందుకెళ్లాలన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే స్థాయి కాకుండా, భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలను ఇచ్చేలా ప్రతి విద్యార్ధి తయారు కావాలన్నారు. వ్యక్తిగత నైపుణాన్ని పెంపొందించుకోవాలన్నారు. సృజనాత్మక ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే వారిగా ఎదగాలన్నారు. ఏయూ వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ తరగతి గదుల్లో పొందే జ్ఞానాన్ని ప్రాక్టికల్గా అన్వయించడంతోపాటు, పరిశ్రమలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. విద్యార్థి జీవితంలో ఇంజనీరింగ్ విద్య కీలకమైన దశ అన్నారు. ఆ దశను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు కలిగి వుండాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు చొప్పా ఎల్లారెడ్డి, డీన్ స్కూల్స్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ నారాయణ, డీన్స్, హెచ్వోడీలు, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


