జమ్మలమడుగు రూరల్: రోడ్డు ప్రమాదంలో కారు ఢీ కొన్న సంఘటనలో విద్యార్థి సంఘం నాయకుడు కె.సి. పాములేటి (29) శనివారం రాత్రి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో యువకుడు మోహన్ తీవ్ర గాయాలపాలైన సంఘటన జమ్మలమడుగు మండలంలో చోటు చేసుకోంది. స్థానికుల కథనం మేరకు... పెద్దముడియం మండలం దిగువ కల్వటాల గ్రామానికి చెందిన కె.సి. పాములేటి వైఎసా్స్ర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రతి రోజు జమ్మలమడుగుకు వచ్చి పనులు చూసుకోని తిరిగి స్వగ్రామానికి వెళ్లేవాడు. శనివారం రాత్రి 8–30 గంటల సమయంలో దిగువ కల్వటాల గ్రామానికి చెందిన మోహన్ తో కలసి బైక్లో వెళుతుండగా ఎస్.ఉప్పలపాడు గ్రామ సమీపాన ఉన్న రైల్వె బ్రిడ్జి సమీపంలో వెనుక వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొంది. ఈ సంఘటనలో పాములేటి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మోహన్ను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు.రోడ్డుప్రమాదంలో పాములేటి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రేమించిన యువతి వేరొకరిని
పెళ్లి చేసుకోబోతోందని..
మైదుకూరు : తాను ప్రేమించిన యువతి వేరొకరిని చేసుకోబోతోందనే బాధతో మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన జీవన్ కుమార్ (20) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి తల్లి గారెళ్ల సావిత్రి శనివారం మైదుకూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సావిత్రి కుమారుడు జీవన్ కుమార్ పదో తగరతి వరకు చదివి జీవనం కోసం ఆటో తోలుకుంటున్నాడు. కొన్నాళ్ల కిందట ఇన్స్ట్రాగామ్లో ఖాజీపేట మండలానికి చెందిన యువతి పరిచయమైంది. తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు తల్లితో చెప్పేవాడు. కొన్ని రోజుల కిందట ఆ అమ్మాయి తాను వేరొకరిని వివాహం చేసుకుంటున్నట్టు చెప్పిందని, తాను ఈవిషయాన్ని భరించలేకున్నానని, బతకాలని లేదని, చనిపోతానని జీవన్ కుమార్ తల్లికి చెబుతుండేవాడు. గత నెల 28న ఆ యువకుడు పురుగుల మందు తాగాడు. తల్లి సావిత్రి, బంధువులు చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరించారు. అక్కడి నుంచి పట్టణంలోని ఓ ప్రైవైట్ ఆస్పత్రిలో చేర్పించి కోలుకోకపోవడతో 30న కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా కోలుకోలేక జీవన్ కుమార్ శుక్రవారం మృతి చెందాడు. సావిత్రి శనివారం మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
తాళ్లపాక చెరువులో చేపల మృత్యువాత
రాజంపేట: తాళ్లపాక చెరువులో చేపలు మృత్యువాతకు గురి అయ్యాయి. ప్రధానంగా తాళ్లపాక చెరువులో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో చేపల ఒడ్డుకు చేరుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం వాతావరణం వేసవిని తలపించేవిధంగా ఉండటంతో చెరువులో నీటి మట్టం ఆవిరైపోతోంది. ఈ నేపథ్యంలో చేపలు మృత్యువాత పడటంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


