అదుపుతప్పి..వాహనాలపైకి దూసుకెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి..వాహనాలపైకి దూసుకెళ్లి..

Jun 10 2023 9:40 AM | Updated on Jun 10 2023 9:40 AM

 కార్లపై బోల్తా పడిన పాల వ్యాన్‌  - Sakshi

కార్లపై బోల్తా పడిన పాల వ్యాన్‌

వైఎస్సార్ : కడప–రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులో గల నాలుమలుపు వద్ద శుక్రవారం పాలవ్యాన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుజన (59) అనే మహిళ మృతిచెందింది. ఆర్టీసీ బస్సును ఢీకొని ఒక్కసారిగా పల్టీ కొట్టి రెండు కార్లతో పాటు, ఒక ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో కార్లు, బైక్‌ నుజ్జు నుజ్జు అయ్యాయి. సీకేదిన్నె ఎస్‌ఐ భూమా అరుణ్‌రెడ్డి కథనం మేరకు రాయచోటి నుంచి కడపకు వస్తున్న పాల వ్యాన్‌ ఘాట్‌ రోడ్డులోని నాలు మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి ఆర్టీసీ బస్సును వెనుకవైపు నుంచి ఢీకొంది.

ఒక్కసారిగా పల్టీకొట్టింది. కడప నుంచి రాయచోటికి వెళ్తున్న రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుజన మృతి చెందగా రవి చంద్ర, శ్రియ, ద్విచక్ర వాహనంలో వెళుతున్న బాలాజీరెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.విషయం తెలుసుకున్న చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని 108లో చికిత్స రిమ్స్‌కు తరలించారు.

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులోని నాలుగో మలుపు వద్ద వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్‌ సాయంతో వాహనాలు పక్కకు తొలగించారు. రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement