సూర్యాపేటటౌన్ : మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో గురువారం జరిగింది. సూర్యాపేట రూరల్ ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోలిపేట గ్రామానికి చెందిన బానోత్ తావూర్య(44) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు వారం రోజులుగా భార్య, కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతున్నాడు. గురువారం ఉదయం ఊరి బయట వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి అతడు కాలువ పక్కన వేప చెట్టుకు లుంగీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి భార్య సైదమ్మ, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. మద్యం మత్తులోనే తావూర్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
చౌటుప్పల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. గురువారం చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై లక్ష్మిదుర్గ హోటల్ సమీపంలో ఆగస్టు 31న గుర్తుతెలియని వ్యక్తిని(45–55 ఏళ్లు) ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్సనిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని చౌటుప్పల్లోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో లేదా 87126 62744 నంబర్కు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.
భక్తుల కార్లే టార్గెట్..
ఫ 11 ఏళ్ల బాలుడు అరెస్ట్
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కార్లను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల యాదగిరి కొండపైన కారు అద్దాలు పగులగొట్టి సెల్ఫోన్లు, అన్నప్రాసన చేసే వెండి ప్లేట్ చోరీ చేశారు. అలాగే బుధవారం యాదగిరి కొండ కింద వాహనాల పూజలు చేసే ప్రాంతంలో పార్కింగ్ చేసిన కారు అద్దం పగులగొట్టి అర్ధ తులం బంగారం, రూ.6 వేలు అపహరించారు. ఈ ఘటనలపై అనుమానంతో 11 ఏళ్ల బాలుడిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కొండపైన సీసీ కెమెరాలతో పాటు కొండ కింద అనుమానాస్పదంగా కనిపించిన ఆ బాలుడిని విచారించగా.. గులేర్ సహాయంతో కారు అద్దాలు పగులగొట్టి, అందులోని విలువైన వస్తువులు, నగదు తానే అపహరించినట్లు ఒప్పుకున్నట్లు సీఐ వెల్లడించారు. గతంలో పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ డాక్యుమెంట్ కార్యాలయం కిటికీ నుంచి దూకి కూడా ఆ బాలుడు నగదు అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ బాలుడి తండ్రి శ్మశానవాటికలో ఉంటాడని, బాలుడు సైతం రోడ్లపైనే తిరుగుతూ ఇలాంటి చోరీలకు అలవాటు పడినట్లు తెలిపారు. బాలుడిని భువనగిరిలోని చైల్డ్ కేర్ హోమ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.


