భువనగిరిటౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. జిల్లాలోని పెండింగ్ప్రాజెక్టుల నిధుల సాధనకు ఈనెల 29న చేపట్టిన చలో హైదరాబాద్ పాదయాత్ర సోమవారం ఇందిపార్కు వద్ద ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురవుతున్న బీఎన్తిమ్మాపూర్, నాయక్ తండా నిర్వాసితులకు రూ.420 కోట్ల నష్టపరిహారానికి రూ.206 కోట్లు మాత్రమే విడుదల చేశారని పేర్కొన్నారు. గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.4 టీఎంసీలకు కుదించినా నిర్మాణ పనులకు బడ్జెట్ ఇవ్వలేదని, చర్లగూడెం పనులు పదేళ్లుగా సాగుతున్నా అతీగతి లేదని మండిపడ్డారు. రాచకొండ ఎత్తిపోతల పథకానికి వెంటనే డీపీఆర్ ఖరారు చేసి నిధులు మంజూరు చేయాలన్నారు. బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువలను త్వరితగతిన పూర్తి చేయాలని, మూసీ ప్రక్షాళన పనులకు డీపీఆర్ ప్రకటించి ఎస్టీపీలు ఏర్పాటు చేసి గోదావరి జలాలను అనుసంధానించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.డీ. జహంగీర్, నాయకులు డీజీ నరసింహారావు, కొండమడుగు నరసింహ, వెంకటరాములు, ఆనగంటి వెంకటేష్, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాస చారి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్ పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
ఫ ఇందిరాపార్క్ వద్ద ధర్నా


