భువనగిరిటౌన్ : పదేళ్లుగా నిలిచిపోయిన పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే నిజం చేసి చూపిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో పనులను పూర్తి చేయించి మొదటి విడతలో 120 మందిరి కేటాయించామన్నారు. భువనగిరి నియోజకవర్గానికి మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే 3,000 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై, 1,650 గృహప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి నియోజకవర్గానికి కొత్తగా మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించబోతున్నామని పేర్కొన్నారు. 45 రోజుల్లో భువనగిరిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ శ్రీవాణిరవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్చిస్తీ, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ఆందోళన
గత ప్రభుత్వంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపికై న 444 మందికి ఒకేసారి ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. డబుల్బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ సభ ముగింపు దశకు వచ్చే సమయంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా ఆందోళనకు దిగారు. సభా ప్రాంగణంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి
ఫ సింగన్నగూడెంలో120 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభం


